‘అహా నా పెళ్ళంట’ మూవీలో కోట పాత్రకు ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా!

18 Jun, 2021 19:57 IST|Sakshi

రాజేంద్ర ప్రసాద్‌ తొలి కామెడీ చిత్రం ఆహా నా పెళ్లంట. ఆదివిష్ణు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారంగా 1987 వచ్చిన ఈ మూవీకి జంధ్యాల దర్శకత్వం వహించారు. తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల ట్రెండ్‌కు రెడ్‌ కార్పెట్‌ పరిచిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్‌ కామెడీ హీరోగా అన్నివర్గాల ప్రేక్షకుల అలరించాడు. అంతేగకా హాస్య బ్రహ్మ బ్రహ్మనందంను నటుడిగా పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే. ఇందులో బ్రహ్మి నత్తివాడిగా.. అరగుండు పాత్రలో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈ మూవీలో ఇప్పటికి ప్రత్యేకంగా గుర్తు చేసుకునే పాత్ర పిసినారి లక్ష్మీపతి.

ఈ పాత్రలో సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు ఒదిగిపోయారు. చెప్పాలంటే ఆహా నా పెళ్లంట మూవీ గుర్తు వస్తే చాలు ముందుగా గుర్తోచ్చే పాత్ర కోట శ్రీనివాస్‌దే. ఇంటి దూలానికి బతికి ఉన్న కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ చికెన్‌ కూరతో అన్నం తింటున్నట్టుగా ఆస్వాధించిన సన్నివేశం ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇక చూట్టాలు ఇంటికి వస్తే ఇలా చేయాలంటూ ఆ సన్నివేశాన్నే ఉదహరణగా తీసుకుంటూ చమత్కరిస్తుంటారు. అంతేగాక బట్టలను పొదుపు చేసేందుకు పేపర్ చుట్టుకుని పడుకోవడం ఇలా ఎన్నో సీన్లలో పిసినారి లక్ష్మిపతిగా కోట తన నటనతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ఇప్పటికీ ఆ సీన్లు గుర్తోస్తే నవ్వని వారుండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఆ పాత్రను తాను తప్ప ఇంకెవరూ చేయలేరేమో అన్నంతగా కోట పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఒదిగిపోయాడు.

అంతలా ఆ పాత్రను పండించిన కోట శ్రీనివాస్‌ను మొదట తీసుకునేందుకు నిర్మాత రామానాయుడు ఒప్పుకొలేదట. ఈ విషయాన్ని స్వయంగా కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్య్వూలో చెప్పాడు.  ఎందుకంటే ఈ మూవీకి పిసినారి లక్ష్మిపతి పాత్రే కీలకం. అది పండితేనే ఈ సినిమా హిట్‌ లేదంటే పరాజయం చూడాల్సిందే. అంతటి ఈ ప్రధాన పాత్రకు కోట శ్రీనివాస రావును తీసుకోవాలని డైరెక్టర్‌ జంధ్యాల రామానాయుడికి సూచించాడట. అయితే ఈ పాత్ర కోటతో వద్దని ప్రముఖ నటుడు రావుగోపాలరావుతో చేయించాలని ఆయన అనుకున్నట్లు కోట వివరించాడు. అయితే జంధ్యాల మాత్రం ఆయనను తప్ప ఇంకేవరిని లక్ష్మీపతి పాత్రకు ఒప్పుకోలేదట. ఈ విషయంపై రామానాయుడు, జంధ్యాల దాదాపు 20 రోజుల పాటు వాదించుకున్నారని ఆయన అన్నాడు. అయితే కోట నటించిన మండలాధీశుడు చిత్రం విడుదల తర్వాత జంధ్యాల ఈ పాత్రకు కోటను ఫిక్స్‌ అయ్యారట, దీంతో ఆ మూవీలో పిసినారి పాత్రకు కోటను తప్ప ఇంకేవరిని తీసుకున్న పరాజయం తప్పదని తెల్చి చెప్పాడట.

దీంతో రామానాయుడు చివరకు ఈ పాత్రకు కోట శ్రీనివాసరావును ఓకే చేశారట. కాగా ఒక రోజు చెన్నై వెళ్లడానికి కోట శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టుకు వెళ్తుండా  అక్కడ ఆయనకు రామానాయుడు కనిపించారట. కోటను చూసిన ఆయన ఇక్కడకు రావయ్యా నీతో ఓ విషయం చెప్పాలని పిలిచాడట. జంధ్యాలతో ఓ సినిమా ప్లాన్ చేశా అని, అందులో లక్ష్మీపతి పాత్ర గురించి కోటకు చెప్పి. జంధ్యాలతో జరుగుతున్న వాదన గురించి కూడా వివరించాడట. వాదన ఎందుకండీ ఈ క్యారెక్టర్‌కు రావు గోపాలరావే న్యాయం చేస్తాడని ఆయన బదులిచ్చినట్లు తెలిపారు. కానీ రావుగోపాలరావుకు ఎంత మేకప్ వేసినా ఆయన ముఖంలో ప్యూర్‌నెస్ రాదని జంధ్యాల అంటున్నారని రామానాయుడు ఆయనతో అన్నారని, ఏం చెప్పాలో అర్థంకాక సందిగ్ధంలో ఉన్న కోటకు ఆ పాత్రను నువ్వే చేయాలని బంపర్ ఆఫర్ ఇచ్చేశాడట రామానాయుడు. 

మరిన్ని వార్తలు