Gopichand- Teja: కథ చెప్తే ఓకే అన్నావ్‌, తర్వాత ఫోన్‌ ఎత్తకుండా నన్ను పక్కన పడేశావ్‌.. తేజ ఫైర్‌

26 Apr, 2023 07:22 IST|Sakshi

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీలో డింపుల్‌ హయాతి కథానాయికగా నటిస్తోంది. గోపీచంద్‌ కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్‌. తాజాగా రామబాణం హీరో గోపీచంద్‌ను ఇంటర్వ్యూ చేశాడు డైరెక్టర్‌ తేజ. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే అతడు పలు విషయాల్లో హీరోను కడిగిపారేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలయ్యతో ప్రకటించిన మూవీ నీ దగ్గరకు ఎలా వచ్చింది? డైరెక్టర్‌ శ్రీవాస్‌తో గొడవలయ్యాయట.. నిజమేనా? అని అడగ్గా.. సినిమాలో లెన్త్‌లు ఎక్కువైపోతున్నాయి. గతంలో ఇలా జరిగిన సినిమాల ఫలితం ఎలా ఉందో చూశాను. అందుకే ఈ విషయంలో డైరెక్టర్‌కు, నాకు చిన్న గొడవలయ్యాయి అని ఒప్పుకున్నాడు గోపీచంద్‌. బాగా నచ్చిన సినిమా ఏదన్న ప్రశ్నకు జయం అని బదులిచ్చాడు.

నీకు ఒక కథ చెప్పాను, ఓకే అన్నావు. హీరోయిన్‌ దొరకలేదు.. మంచి హీరోయిన్‌ను వెతికేలోపు ఇంకో సినిమా మొదలుపెట్టేశావు. మళ్లీ నేను ఫోన్‌ చేస్తే కాల్‌ కూడా లిఫ్ట్‌ చేయలేదు అని తేజ అనగా తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాడు హీరో. అంటే నీ దృష్టిలో తేజ కంటే మరొక డైరెక్టర్‌ బెటర్‌ అని నన్ను పక్కన పడేశావ్‌ కదా, అందుకే ఫోన్‌ ఎత్తలేదు అని విమర్శలు గుప్పించాడు. మీ నాన్నగారు చేసిన మంచిపని వల్ల నీకు జయంలో ఛాన్స్‌ వచ్చింది. మీ నాన్న గొప్పోడు. మరి నువ్వేం పీకావ్‌? అంటూ గోపీచంద్‌ను సూటిగా ప్రశ్నించాడు తేజ. మొత్తానికి ఇంటర్వ్యూలో తన ప్రశ్నలతో గోపీచంద్‌ను ఎన్‌కౌంటర్‌ చేశాడు తేజ.

మరిన్ని వార్తలు