అదే గేయ రచయిత గొప్పదనం: రామజోగయ్య శాస్త్రి

4 Jan, 2023 17:21 IST|Sakshi

‘మంచి కవిత్వం రాసే ప్రతిభ ఉన్నంత మాత్రాన సినిమా పాటలు రాయలేం. ఇక్కడ ట్యూన్ కి రాయడం ప్రధానం. అలాగే కొన్ని సార్లు ట్యూన్ లేకుండా కూడా రాయాలి. దర్శకుడు విజన్ కి తగట్టు అడుగులు వేయడంలోనే గేయ రచయిత గొప్పదనం ఉంటుంది. ఎంతగొప్పగా రాసినా సింపుల్ గా రాయడం ఇక్కడ ప్రధానం. బాగా చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు, పట్టుదల సహనం ఉండాలి. ఇదే యువ గేయ రచయితలకు నేను ఇచ్చే సలహా’ అని ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. తాజాగా ఆయన బాలయ్య 'వీరసింహారెడ్డి'లో అన్ని పాటలకు,  చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోని 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' పాటకు సాహిత్యం అందించారు.  ఈ రెండు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా తాజాగా రామజోగయ్య శాస్త్రీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' గురించి చెప్పండి ? 
ఈ లిరిక్స్ లో సౌండింగ్ సరదా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ తో చెప్పాను. దాని చుట్టూ ఒక కాన్సెప్ట్ అనుకొని ఒక ట్యూన్ ఇచ్చారు. పాట చాలా అద్భుతంగా వచ్చింది. 
 
సంక్రాంతి సినిమాలన్నిటికీ లిరిక్స్ రాశారు కదా.. ఈ సంక్రాంతి మీదే అనిపిస్తోంది ? 
అనుకుంటే జరగదు. అలా కుదిరిందంతే. 

చాలా పాటలు రాస్తూనే ఉంటారు కదా.. ఎక్కడైనా రైటర్స్ బ్లాక్ ఉంటుందా ? 
అలా ఏమీ ఉండదు. ఇన్నాళ్ళ అనుభవంతో టెక్నిక్, అలవాటు ప్రకారం కంటెంట్ ఇవ్వడం జరిగిపోతుంది. అయితే గొప్ప పాట రావాలి, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కావాలంటే మాత్రం కొంత సమయం పడుతుంది.

'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్యలో అలా నెక్స్ట్ లెవల్ కంటెంట్ అనుకునే పాటలు ఏంటి?
'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకంగా ఉంటుంది. పెద్ద సినిమాలకి వచ్చేసరికి కావాల్సిన సమయం ఇస్తారు. పైగా అఖండ సినిమాకి రాయలేదు. ఆ పట్టుదల ఉంటుంది. క్రాక్ తర్వాత గోపీచంద్ తో మళ్ళీ కలసి చేస్తున్నాను.  'వీరసింహారెడ్డి సింగిల్ కార్డ్ రాశాను. మొదటి నుంచి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత బలంగా రాసే అవకాశం ఉంటుంది. తమన్  తో కలసి అన్ని పాటలు అద్భుతంగా చేశాం. విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నాలుగో పాట కూడా అంతకు మించి ఉంటుంది.

సింగిల్ కార్డ్ రాస్తున్నపుడు మీ పై ఒత్తిడి ఉంటుందా ?  
సింగిల్ కార్డ్ అయినా.. ఒక్క పాట అయినా.. దర్శకుడి కల కోసమే గేయ రచయిత పని చేస్తాడు. దర్శకుడు విజన్ కి తగట్టు అడుగులు వేయడంలోనే గేయ రచయిత గొప్పదనం ఉంటుంది. అయితే సింగిల్ కార్డ్ రాయడంలో ఒక సౌలభ్యం ఉంటుంది. పాటలన్నీ ఒకరే రాస్తారు కాబట్టి ఏ పాటలో ఎలాంటి మాట వాడాం, ఏ భావం చెప్పాం..  ఫ్లో సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆరు పాటలు ఆరుగురు రాస్తే మాత్రం.. ఈ కోర్డినేషన్ పని దర్శకుడు చూసుకోవాల్సివస్తుంది. 

పెద్ద హీరోల సినిమాలకి రాస్తున్నపుడు అభిమానుల అంచనాలు అందుకోవడం సవాల్ గా ఉంటుందా ? 
ప్రతి పాటకు సవాల్ ఉంటుందండీ.  ఉదాహరణకు ఒక ప్రేమ పాటే రాస్తున్నాం అనుకోండి. మనమే ఇప్పటికే బోలెడు ప్రేమ పాటలు రాసుంటాం. ఈ పాటలో ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది.  బాలయ్య గారికి ఇదివరకే కొన్ని పాటలు రాశాం. ఈ సారి ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి, సవాల్ ఉంటుంది. 

మా బావ మనోభావాలు ఐడియా ఎవరిది ?  
మా బావ మనోభావాలు ఐడియా నాదే. ఒకసారి తమన్ తో చెబితే దాచి పెట్టమని చెప్పాడు. తర్వాత దర్శకుడు గోపీచంద్ కి చెప్పడం, పాట చేయడం జరిగింది. మనోభావాలు అందరూ సమకాలీనంగా వాడే మాటే.  

మాస్ మొగుడు పాట గురించి ? 
మాస్ మొగుడు పాట మంచి ఊపుతో ఉంటుంది. క్లైమాక్స్ కి తగ్గట్టుగా ఉంటుంది. 

'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్య సినిమాలు ఎలా ఉండబోతున్నాయి ? 
'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్య రెండూ సినిమాలు ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ తో పాటు మంచి మ్యూజికల్ ట్రీట్ ఇస్తాయి. ఈ రెండు చిత్రాలు బూమ్ బద్దలు రికార్డ్ లు సృష్టిస్తాయి. 

బాలకృష్ణ, చిరంజీవి గారి పాటలు రాస్తున్నపుడు ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు ? 
బాలకృష్ణ, చిరంజీవి గారి ఇమేజ్ పాట రాయడానికి ఒక ఊతమిస్తుంది. కొన్ని మాటలు వాళ్ళ ఇమేజ్ కే రాయగలం. చిరంజీవి గారికి రాసిన పాట విని చాలా బావుందని అన్నారు. అలాగే మనోభావాలు పాట షూటింగ్ జరిగినప్పుడు సెట్ కి వెళ్లాను. బాలకృష్ణ గారు కూడా బావుందని అభినందించారు. మనోభావాలు పాట విజువల్ గా కూడా చాలా కిక్ ఇచ్చింది. 

ట్యూన్ కి లిరిక్స్ రాస్తారా ? లిరిక్స్ కి  ట్యూన్ చేస్తారా ? 
సంగీత దర్శకుడికి, లిరిక్ రైటర్ కి కేంద్ర బిందువు దర్శకుడు. ఆయన కథ, సందర్భం, విజన్ కి తగ్గట్టు పని చేయాల్సి ఉంటుంది. ఎక్కవ సమయాల్లో ట్యూన్‌కే లిరిక్స్ రాస్తాను.

యువ గేయ రచయితలకు మీరు ఇచ్చే సలహా ? 
మనలో ఆసక్తి, పాటకు రాసే లక్షణం ఉందో లేదో చూసుకోవాలి. కొందరు చాలా మంచి కవిత్వం రాసే ప్రతిభ కలిగిఉంటారు. కానీ ఇక్కడ ట్యూన్ కి రాయడం ప్రధానం.  ఎంతగొప్పగా రాసినా సింపుల్ గా రాయడం ఇక్కడ ప్రధానం. బాగా చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు, పట్టుదల సహనం ఉండాలి

మరిన్ని వార్తలు