Nayanthara: నయనతార ప్లేస్‌లో మరో హీరోయిన్..!

12 Apr, 2023 08:33 IST|Sakshi

నయనతార పాత్రలో నటి రాశీఖన్నా నటించనున్నారా? కోలీవుడ్‌లో జరుగుతున్న తాజా ప్రచారం ఇదే. నయనతార పెళ్లి, సరోగసీ ద్వారా తల్లి కావడం వంటి కారణాల కారణంగా నటనకు చిన్న గ్యాప్‌ ఇచ్చారు. అయినప్పుటికీ షారూఖ్‌ఖాన్‌ సరసన నటిస్తున్న జవాన్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూనే ఉన్నారు. కాగా మళ్లీ నటిగా బిజీ అయ్యారు. ఇప్పుడు 9 చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.

అందులో వైనాట్‌ శశికాంత్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఒకటి. హీరోయిన్‌ ఓరియెంటెండ్‌ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో నటుడు మాధవ్‌, సిద్ధార్ధ్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు చిత్ర వర్గాలు ఇటీవలే ప్రకటించాయి. కాగా ఇప్పుడా చిత్రంలో అనివార్య కారణాల వల్ల నయనతార నటించడం లేదని, ఆమెకు బదులుగా రాశీఖన్నాను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

క్రికెట్‌ క్రీడ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ది టెస్ట్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా రాశీఖన్నా ఇటీవల నటుడు కార్తీ సరసన నటించిన సర్ధార్‌ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

అదేవిధంగా హిందీ వెబ్‌సీరీస్‌ ఫర్జీ చిత్రంలోనూ నటించింది. తరచూ గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న రాశీ ఖన్నా ప్రస్తుతం తమిళంలో గీత రచయిత పా.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. ఇందులో జీవా కథానాయకుడిగా నటిస్తుండగా అర్జున్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా వైనాట్‌ శశికాంత్‌ దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్‌ వరించిందన్నది నిజంగా ఈ బ్యూటీకి లక్కే.

మరిన్ని వార్తలు