Rashmi Gautam: మానవత్వం చచ్చిపోయింది.. వారికి బతికే హక్కులేదు

10 Nov, 2021 12:08 IST|Sakshi

బుల్లితెరపై యాంకర్‌ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్‌ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తుంది ఈ అందాల యాంకరమ్మ. గుంటూరు టాకీస్‌ మూవీతో హీరోయిన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్‌ బిజీ అయింది. కెరీర్‌ పరంగా ఎంత బిజీ ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు సమాజంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. 

ముఖ్యంగా జంతువులపై దాడి చేసే ఘటనలపై.. వాటికి హాని కలిగించే విషయాలపై ఎప్పటికప్పుడు రష్మీ స్పందిస్తుంటుంది.  అలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే వాటిని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తుంది. తాజాగా మరోసారి అలాంటి ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయింది రష్మి.

ఇటీవల దీపావళి సంబరాల్లో పశ్చిమబెంగాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంబరాల్లో భాగంగా కొందరు ఆకతాయిలు.. ఓ వీధి కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చేశారు. దీంతో ఆ కుక్కకు తీవ్రగాయాలవడంతో పాటు తోక తెగిపోయింది. ఇది గమనించిన చుట్టుపక్కల జనం కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ కుక్క సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. సోషల్‌ మీడియా ద్వారా ఈ విచారకరమైన వార్త తెలుసుకున్న రష్మి.. ఆ ఘటన పై తనదైన స్టైల్లో స్పందిస్తూ.. ‘మానవత్వం చచ్చిపోయింది. అలాంటి మనుషులకు ఈ భూమిపై బతికే హక్కు లేదు’ అంటూ విరుచుకుపడింది. రష్మిక పోస్ట్‌ చూసిన నెటిజన్స్‌ సైతం.. ఆ ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు