ఆ వార్తలు నిజమైతే బాగుండు.. అదే నా కల: రష్మిక

20 Feb, 2021 13:42 IST|Sakshi

అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది రష్మిక మందన్న. కిరాక్కు పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ నటించిన తొలి చిత్రం ఛలో చిత్రం సక్సెస్‌నిస్తే, ఆ తరువాత విజయ్‌దేవరకొండతో రొమాన్స్‌ చేసిన గీతగోవిందం సంచలన విజయాన్ని అందించింది. తర్వాత ఇక ఈ అమ్మడు వెనక్కితిరిగి చూసుకోలేదు. వరుస సక్సెస్‌లతో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఇలా తెలుగు,కన్నడ భాషా చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు ఇటీవల బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించింది.

ఇదిలా ఉంటే ఈ కన్నడ బ్యూటికి సంబధించిన ఒక వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు నటించే బాలీవుడ్‌ చిత్రం కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకుందని ఆ వార్త సారాంశం. ఈ వార్తలపై తాజాగా రష్మిక స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను భారీగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాననే వార్తలు వస్తున్నాయి. అవి నిజమైతే బాగుండేది. ఆ వార్తల్లో వస్తున్నట్లు అంత మొత్తం రెమ్యునరేషన్‌ తీసుకోవాలనేదే నా కల’ అంటూ ఆ వార్తలు ఒట్టి పుకార్లేనని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్‌లో అల్లు అర్జున్ తో క‌లిసి ‘పుష్ప‌’, శ‌ర్వానంద్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు ’ అనే సినిమాతో పాటు హిందీ రెండు సినిమాల్లో నటిస్తోంది. 

మరిన్ని వార్తలు