Rashmika Mandanna: వచ్చే జన్మలో అలా పుడతానంటున్న రష్మిక మందన్నా

3 Mar, 2022 18:30 IST|Sakshi

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా మార్చి 4న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. 'పాండమిక్ తర్వాత పిల్లలతో చూసే సినిమాను మిస్ అయ్యాం. ఆ వాతావరణాన్ని మా సినిమా వంద శాతం ఇస్తుందని నమ్ముతున్నా. థియేటర్లు ఫ్యామిలీలతో కళకళలాడాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు నేను చేసిన 'ఉన్నది ఒక్కటే జిందగి' సినిమా చూసి యూత్ చాలామంది తమను తాము చూసుకున్నామని చెప్పారు. 'నేను శైలజ' ఫాదర్, డాటర్ రిలేషన్‌పై తీశాను. అందులో చెప్పినట్లుగా నా స్నేహితుడు కనెక్ట్ అయి పెద్దగా మాటలు లేని అతను తప్పు తెలుసుకుని నన్ను పలుకరించాడు. ఇందులో అన్ని సీన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ సీన్‌కు మహిళలు చప్పట్లు కొడతారు' అన్నారు.

రష్మిక మందన్న మాట్లాడుతూ.. 'చాలా కాలం తర్వాత ఫ్యామిలీ సినిమా చేశాం. థియేటర్‌కు వచ్చి చూడండి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. కొన్ని సంఘటనలు మన ఇంటిలో జరిగేవిగా కనిపిస్తాయి. మా ఇంటిలో కూడా అమ్మ, నాన్న, చెల్లి ఈ సినిమా విడుదల రోజు తొలి ఆట చూస్తానన్నారు. మీరు కుటుంబంతో ఎంజాయ్ చేయండి' అన్నారు.

అనంతరం రష్మిక పలు ప్రశ్నలకు ఇలా సమాధానాలిచ్చారు. పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేశాక మహిళగా డ్రెస్సింగ్‌లో చాలా కష్టం అనిపించింది. అందుకే వచ్చే జన్మంటూ వుంటే మగవాడిగా పుడతానంటూ చలోక్తి విసిరారు. నిజజీవితంలో పెండ్లి గురించి చెబుతూ.... మంచి మనసున్న వ్యక్తి లభిస్తే చేసుకుంటానని, ఇప్పటి వరకు ఎవరితోనూ పెండ్లి ఫిక్స్ కాలేదని తేల్చిచెప్పింది. దర్శకుడు కిశోర్ ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ఇప్పుడు ఆడవాళ్ళు మీకు జోహార్లు  తీశాం. ముందు ముందు మగాళ్ళ పేరుతో మీద కూడా చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు