క్రేజీ ఆఫర్‌: రామ్‌ చరణ్‌కు జోడీగా రష్మిక!

16 Apr, 2021 20:37 IST|Sakshi

రష్మిక మందన్నా.. సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కర్ణాటక బ్యూటీ. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోలందరి సరసన నటించింది.  అనంతరం విజయ్‌ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాలో నటించడంతో రష్మిక క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి ఈ భామకు సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అటే తెలుగులోనే కాకుండా.. ఇటు తమిళం, హిందీలో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రాబోతున్న గుడ్ బై..  సిద్ధార్థ్ మల్హోత్రా న‌టిస్తోన్న మిష‌న్ మ‌జ్నులో హీరోయిన్‌గా చేస్తోంది.

తాజాగా రష్మికకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. తెలుగులో ఓ క్రేజీ ఆఫర్‌ కొట్టేసినట్లు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌తో జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మికను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు శంకర్‌ రష్మికకు కథను  వినిపించినట్లు, కథ నచ్చడంతో తను కూడా మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వినికిడి.

పొలిటికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక జర్నలిస్ట్‌ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో చరణ్‌ ఐఏఎస్‌ అధికారి నుంచి ముఖ్యమంత్రి అయ్యే పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా.. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించనున్నారు. భారీ బడ్జెత్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం 2022లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. కాగా రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇవి పూర్తయిన వెంటనే నేరుగా శంకర్‌ సినిమాలో జాయిన్‌ కానున్నాడు.

చదవండి: అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక
సగం షూటింగ్‌ అయ్యాక యంగ్‌ హీరోను సైడ్‌ చేశారు

మరిన్ని వార్తలు