Rashmika Mandanna: రోజూ ఇంటికి రాగానే పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా

24 Mar, 2023 17:04 IST|Sakshi

అందంతో, అల్లరితో అందరినీ బుట్టలో వేసుకుంటుంది రష్మిక మందన్నా. కన్నుగీటి కొంటెగా మాట్లాడుతూ, చిన్నపిల్లలా అల్లరి చేస్తూ, అందరినీ కలుపుకుపోతూ తెగ హడావుడి చేస్తుందీ అమ్మడు. తన బోళాతనానికి ఫిదా అయిన యూత్‌ ఆమెను ముద్దుగా నేషనల్‌ క్రష్‌ అని పిలుచుకుంటారు. కానీ ఈ మధ్య ఆమె నోరు తెరిస్తే చాలు ఏదో ఒక వివాదం మొదలువుతోంది. వరుస వివాదాలతో ట్రోలింగ్‌ సుడిగుండంలో చిక్కుకున్న రష్మిక.. మొదట్లో దీనిపై తెగ ఆందోళన చెందేది. కానీ రానురానూ వాటిని పట్టించుకోకుండా ఉండేందుకు ట్రై చేస్తూ వస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది రష్మిక. 'చిన్నచిన్న విషయాలు కూడా నాకెంతో ముఖ్యమైనవి. నేను లేవగానే నా కుక్కపిల్లలతో ఆడుకుంటాను. అది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మాటలు ఎంతో శక్తివంతమైనవి. ఆ మాటలతో మనిషిని నిలబెట్టవచ్చు, అదే మనిషి మనసు ముక్కలు చేయవచ్చు. నేను నా డైరీలో ప్రతి చిన్న విషయాలు కూడా రాసుకుంటాను. అందులో ఒకటి ఏంటో తెలుసా? నేను ఇంటికి రాగానే అందరి పాదాలకు నమస్కరించాలి. నా కుటుంబ సభ్యులవి మాత్రమే కాదు మా ఇంట్లో ఉండే పనివాళ్ల కాళ్లకు సైతం నేను నమస్కరిస్తాను. వాళ్లను వేరుగా చూడను. నాకు అందరినీ గౌరవించడం మాత్రమే తెలుసు' అని చెప్పుకొచ్చింది.

తన పేరెంట్స్‌ గురించి మాట్లాడుతూ.. 'అందరూ అనుకున్నట్లుగా నా తల్లిదండ్రులు నన్ను చూసి అంతలా గర్వపడరు. ఎందుకంటే వారు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. అసలు నేనేం చేస్తున్నాననేది కూడా వాళ్లకు అర్థం కాదు. కానీ ఎప్పుడైనా ఏదైనా అవార్డు వచ్చిందంటే మాత్రం ఉప్పొంగిపోతారు. వాళ్లు నన్ను చూసి గర్వపడాలంటే నేనింకా చాలా సాధించాలి. నన్ను ఏ లోటూ లేకుండా పెంచారు, ఎంతో బాగా చూసుకున్నారు. అందుకు నేనెప్పుడూ కృతజ్ఞురాలినే! ఇప్పుడు నా వంతు వచ్చింది. నేను వాళ్లను బాగా చూసుకుంటాను' అని చెప్పుకొచ్చింది రష్మిక.

మరిన్ని వార్తలు