అప్పుడు అలర్జీ టెస్ట్‌ చేయించుకోండి!

5 Aug, 2020 03:21 IST|Sakshi

అందంగా కనిపించేందుకు కథానాయికలు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా చర్మ సౌందర్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీ చర్మ సౌందర్య రహస్యం ఏంటి? అని కథానాయికల్ని అడిగితే వాళ్లు పాటిస్తున్న టిప్స్‌ చెబుతారు. రష్మిక మందన్నా కూడా తాజాగా చర్మ సంరక్షణ గురించి ఓ విషయం చెప్పారు. ‘ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ’ వంటి హిట్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ స్కిన్‌ గురించి ఓ విషయాన్ని షేర్‌ చేసుకున్నారు. ‘‘మీ చర్మం రఫ్‌గా తయారవుతున్నా, డల్‌గా కనిపిస్తున్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే.. ‘అలర్జీ టెస్ట్‌’.

రెండేళ్ల కిందట నా చర్మంలో ఏదో తేడా కనిపించింది. బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచించాను. నేను శాకాహారిని. ఒకవేళ నేను తీసుకునే ఆహారంలో నాకు పడనవి ఏమైనా ఉన్నాయా? అనిపించింది. అంతే.. అలర్జీ టెస్ట్‌ చేయించుకున్నాను. వైద్య పరీక్షలో నాకు అలర్జీ ఉందని తేలింది. అప్పటి నుంచి నా శరీరానికి అవసరం లేని, పడని ఆహారాన్ని పక్కన పెట్టడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నా చర్మ సమస్యలు మాయమయ్యాయి. అందుకే స్కిన్‌ బాగా లేనట్లు అనిపిస్తే, పరీక్షలు చేయించుకోవాలి. మనకు సరిపడే ఆహారం తీసుకోవాలి. రోజుకి కనీసం రెండు లీటర్లు నీళ్లు తాగాలి. ఓ రకంగా భారతీయులు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే అలర్జీ ప్రభావంతో దీర్ఘకాలికంగా బాధించే సమస్యలు ఇక్కడి వారిలో ఉండవు’’ అన్నారు.

మరిన్ని వార్తలు