Rashmika Mandanna: హిందీ నేర్చుకుంటున్న బ్యూటీ

19 May, 2021 10:03 IST|Sakshi

దక్షిణాదిలో కథానాయికగా నిరూపించుకుని అగ్రతారల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు రష్మికా మందన్నా. ఇప్పుడు ఉత్తరాదిన కూడా నిరూపించుకోవడానికి కృషి చేస్తున్నారీ కన్నడ బ్యూటీ. అమితాబ్‌ బచ్చన్‌ మెయిన్‌ లీడ్‌ చేస్తున్న ‘గుడ్‌ బై’, సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్‌ మజ్ను’ చిత్రాల్లో రష్మిక హీరోయిన్‌గా చాన్స్‌ దక్కించుకున్నారు. అలాగే బీ టౌన్‌లో తాను ముచ్చటగా మూడో ప్రాజెక్ట్‌కు కూడా సైన్‌ చేసినట్లు ఇటీవల రష్మిక తెలిపారు. ఈ చిత్రాల్లో డైలాగ్స్‌ స్పష్టంగా పలకడం కోసం హిందీ భాష పై పట్టు సాధించాలని రష్మిక  నిర్ణయించుకున్నారు.

ఇందుకోసం ఓ హిందీ ట్యూటర్‌ను కూడా నియమించుకుని పాఠాలు చెప్పించుకుంటున్నారట. అంతేకాదు.. హిందీ భాషను త్వరగా నేర్చుకునేందుకు ఇంట్లో, స్నేహితులతో కూడా ఎక్కువగా హిందీలోనే మాట్లాడుతున్నారట రష్మిక. పైగా ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా ఆమెకు బోలెడంత సమయం దొరికినట్లయింది. ఈ ఖాళీ సమయాన్ని హిందీ నేర్చుకోవడానికి సద్వినియోగం చేసుకుంటున్నారట  రష్మికా మందన్నా. ఇక దక్షిణాదిలో అల్లు అర్జున్‌ ‘పుష్ప’, శర్వానంద్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో రష్మిక  హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: శాండల్‌ వుడ్‌ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే!

మరిన్ని వార్తలు