Karthi-Rashmika Mandanna: కార్తితో మరోసారి జోడి కట్టబోతున్న రష్మిక మందన్నా

27 Sep, 2022 09:21 IST|Sakshi

‘విరుమాన్‌’ చిత్రం విజయంతో మంచి జోష్‌లో ఉన్న కార్తీ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పొన్నియిన్‌ సెల్వన్‌. విక్రమ్, జయంరవి, విక్రమ్‌ ప్రభు, శరత్‌కుమార్, ప్రభు, పార్తీపన్, ప్రకాశ్‌రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష వంటి స్టార్స్‌తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. ఏఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబర్‌ 30వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. నటుడు కార్తీ ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

చదవండి: జూ. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ‘ఆది’ రీరిలీజ్‌! ఎప్పుడంటే..

కాగా ఈయన నటిస్తున్న మరో చిత్రం సర్దార్‌. ఇందులో కార్తీ పోలీస్‌ అధికారి, వృద్ధుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పీఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజీషా విజయన్, రాశీఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. యాక్షన్‌ జానర్‌లో తెరకెక్కుతున్న సర్దార్‌ చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో కార్తీ తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు. కుక్కూ, జిప్సీ చిత్రాల ఫేమ్‌ రాజు మురుగన్‌ దర్శకత్వం వహించనున్న చిత్రంలో కార్తీ హీరోగా నటించనున్నారు. దీనికి జపాన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు.

చదవండి: అప్పుడే ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్‌, ఎక్కడంటే..

అయితే ఈసినిమాలో ఆయనకు జంటగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రేజీ బ్యూటీ ఇంతకు ముందు కార్తీకి జంటగా సుల్తాన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయింది. ప్రస్తుతం విజయ్‌కు జంటగా వారీసు చిత్రంతో పాటు బాలీవుడ్‌లో వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటిస్తున్న గుడ్‌బై చిత్రం. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా తెలుగులో పుష్ప 2 చిత్రంలో నటించడానికి రషి్మక సిద్ధం అవుతోంది. కాగా కార్తీ హీరోగా నటించే జపాన్‌ చిత్రం నవంబర్‌లో సెట్స్‌ పైకి రానుంది. దీంతో ఈ చిత్రంలో నటించడానికి రష్మిక గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.  

మరిన్ని వార్తలు