నెంబర్‌ 1 పొజీషన్‌ కోసం పోటీపడుతున్న ముద్దుగుమ్మలు

19 Apr, 2021 13:44 IST|Sakshi

రష్మిక మందన్నా, పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్లు వీళ్లే. తెలుగులో ఇప్పుడు వీరిదే హవా. దాదాపు పెద్ద సినిమాలన్నింటినీ తమ ఖాతాలో వేసుకుంటున్నీ ముద్దుగుమ్మలు నెంబర్‌ వన్‌ పొజీషన్‌ కోసం పోటీ పడుతున్నారు. సీనియర్‌ స్టార్‌ హీరోయిన్ల హవా తగ్గడం ఈ బ్యూటీస్‌కు మరింత కలిసొచ్చింది. యూత్‌లోనూ ఈ ఇద్దరు హీరోయిన్లకు సూపర్‌ క్రేజ్‌ ఉండటంతో దాదాపు బడా సినిమాలన్నింటిలోనూ వీళ్లే డైరెక్టర్ల ఫస్ట్‌ ఛాయిస్‌గా మరిపోయారు.

గతేడాది సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు  చేతిలో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది కార్తీ సరసన సుల్తాన్‌ మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చేసింది. అంతేకాకుండా బాలీవుడ్‌లో ఏకకాలంలో రెండు సినిమాలు చేసేస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో నటిస్తూనే, బిగ్‌బి అమితాబ్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది ఈ కన్నడ బ్యూటీ. మరోవైపు శంకర్‌- రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలోనూ రష్మికనే తీసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 

ఇక అల వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ను ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. కెరీర్‌ మొదట్లో అపజయాలు పలకరించినా ఇప్పుడు మాత్రం జెడ్‌ స్పీడుతో దూసుకుపోతుంది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తూనే, ప్రభాస్‌ సరసన రాధేశ్యామ్‌తో జతకట్టనుంది. మరోవైపు యంగ్‌ హీరో అఖిల్‌ సరసన బ్యాలిలర్‌ సినిమా చేస్తోంది. అంతేకాకుండా త్వరలోనే యంగ్ టైగర్ యన్టీఆర్- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఓ సినిమాలోనూ పూజా నటించనున్నట్లు తెలుస్తోంది.

మహేష్‌ సరసన మరోసారి నటించేందుకు రెడీ అయ్యిందట ఈ పొడుగు కాళ్ల సుందరి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్‌ రావాల్సి ఉంది. ఇలా చేతినిండా సినిమాలతో వచ్చే రెండు, మూడేళ్ల వరకు వీరి క్యాలెండర్‌ ఫుల్‌ బిజీగా మారిపోయింది. రెమ్యునరేషన్‌ విషయంలో ఈ ఇద్దరికీ పోటీ నెలకొంది. ప్రస్తుతం రష్మిక 2 కోట్లు డిమాండ్‌ చేస్తుండగా, పూజా మాత్రం 2.5-3 కోట్ల వరకు అందుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

చదవండి : కరోనా వల్ల మేకప్‌మెన్‌గా మారిన ప్రముఖ నటుడు
అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక


 

మరిన్ని వార్తలు