‘షాక్’‌ ఇచ్చిన దర్శకుడితో రవితేజ సినిమా!

21 Apr, 2021 08:07 IST|Sakshi

హీరో రవితేజ– దర్శకుడు హరీష్‌ శంకర్‌ మూడోసారి కలసి పని చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. రవితేజ హీరోగా నటించిన ‘షాక్‌’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు హరీష్‌. ఆ తర్వాత తన రెండో చిత్రం ‘మిరపకాయ్‌’ని కూడా రవితేజతోనే చేశారాయన. తాజాగా వీరి కాంబినేషన్‌లో మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట.

రవితేజ – హరీష్‌ మధ్య కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం. ప్రస్తుతం రవితేజ తన సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. హరీష్‌ శంకర్‌ కూడా పవన్‌ కల్యాణ్‌ హీరోగా మైత్రీ మూవీస్‌ పతాకంపై ఓ సినిమా చేయనున్నారు. పవన్‌ సినిమా పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టాక రవితేజ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారట హరీష్‌ శంకర్‌. 

‘ఖిలాడి’కి బ్రేక్‌
ఇదిలావుండగా, రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ఈ చిత్రదర్శకుడు రమేశ్‌ వర్మ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘నాకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్వీయ నిర్భంధంలో ఉన్నాను. దయచేసి అందరూ మాస్క్‌ ధరించండి. అనవసరంగా బయట తిరగకండి.. ఇంట్లోనే క్షేమంగా ఉండండి’ అని పేర్కొన్నారు రమేశ్‌ వర్మ. దీంతో ‘ఖిలాడి’ షూటింగ్‌కి చిన్న బ్రేక్‌ పడ్డట్లే. 

చదవండి: కొత్త డైరెక్టర్‌తో రవితేజ

>
మరిన్ని వార్తలు