Krishnam Raju: ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు

12 Sep, 2022 09:58 IST|Sakshi

కృష్ణంరాజు టైటిల్‌ రోల్‌లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ చిత్రానికి అమితమైన ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాను ప్రభాస్‌తో రీమేక్‌ చేయాలని కృష్ణంరాజు ఆశపడ్డారు.. కానీ కుదర్లేదు. అలాగే ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ (2005) సినిమాలోని ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లో ‘ఒక్క అడుగు’ అనే పదం ఉంటుంది. దీన్నే టైటిల్‌గా పెట్టి, ఓ మల్టీస్టారర్‌ సినిమాను తన దర్శకత్వంలోనే చేయాలనుకున్నారు కృష్ణంరాజు. అయితే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అలాగే ‘విశాల నేత్రాలు, జీవన తరంగాలు’ నవలలంటే ఆయనకు ఇష్టం. వీటి ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. అదీ నెరవేరలేదు.

ఇక ప్రభాస్‌ పెళ్లి చూడాలని కృష్ణంరాజు ఎంతగానో ఆశపడ్డారు. కానీ ప్రభాస్‌కు ఉన్న వరుస సినిమాల కమిట్‌మెంట్స్‌ కారణంగా వివాహం వాయిదా పడుతూ వస్తోంది. అలాగే తన ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తిల వివాహాల విషయంలోనూ కృష్ణంరాజుకి ఆశ ఉండటం సహజం. మరోవైపు ఎంపీ అయిన కృష్ణంరాజుకు గవర్నర్‌ హోదాలో బాధ్యతలు నిర్వర్తించాలని ఉండేదట. ఓ దశలో కృష్ణంరాజుకు తమిళనాడు గవర్నర్‌ పదవి అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. 

యంగ్‌ రెబల్‌ స్టార్‌తో మూడు చిత్రాలు
కృష్ణంరాజు–ప్రభాస్‌ కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న తొలి సినిమా ‘బిల్లా’ (2009). ఈ సినిమా వచ్చిన మూడేళ్లకు ‘రెబల్‌’ (2012) సినిమాలో కలిసి నటించారు కృష్ణంరాజు, ప్రభాస్‌. ‘రెబల్‌’ తర్వాత మరోసారి కృష్ణంరాజు, ప్రభాస్‌ కలిసి నటించడానికి పదేళ్లు పట్టింది. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ (2022)లో పరమహంస అనే కీ రోల్‌ చేశారు కృష్ణంరాజు. ఇది ఆయనకు చివరి సినిమా.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు