Rebels of Tupakulagudem teaser: 'వెయ్యి ఆడాలి.. కానీ మనం ఆడింది వందే'.. ఆసక్తిగా టీజర్

28 Nov, 2022 12:17 IST|Sakshi

కరోనా తరువాత ఆడియెన్స్ మైండ్‌సెంట్ పూర్తిగా మారిపోయింది. సినిమాలను చూసే అభిప్రాయంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉంటే జనాలు థియేటర్లకు వస్తున్నారు. చిన్న సినిమాలైనా ఆదరిస్తున్నారు. అదే తరహాలో 'రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ బ్యానర్‌పై  జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. 

ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతున్న ఈ చిత్రానికి సంతోష్ మురారికర్ కథ అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశారు. టీజర్ చాలా బాగుందని.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

రెండు నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ సినిమా మీద ఆసక్తిని పెంచేసింది. 'నా పేరు కుమార్.. ఇది నా ఊరు.. వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు.. కానీ మనం ఆడింది వందే' అంటూ ప్రారంభమైన టీజర్ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ పెంచుతోంది. 'వంద మంది.. బరా బర్ వంద మందిని చూపించాలి'.. 'అన్నా ఇదంతా నిజంగా అయితదా?.. అయితది.. ఏం కావాల్నో అదే అయితది'.. 'ఈ పని ఒక్కడే చేయగలడు సర్.. అయితే ఇదంతా మీకు తెలిసే జరుగుతోందా?' అనే ఈ డైలాగ్స్‌తో సినిమా కథ ఏంటో చెప్పకనే చెప్పేశారు.

అసలు ఏం జరుగుతోంది.. ఆ వంద అబద్దాలు ఏంటి? ఆ వంద మంది కలిసి చేసిన పని ఏంటి?.. తుపాకుల గూడెంలో ఏం జరుగుతోంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా సినిమా టీజర్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26న థియేటర్లోకి రానుంది.

మరిన్ని వార్తలు