రూ.50 కోట్ల మార్క్‌ చేరుకున్న 'లవ్‌ స్టోరీ'

1 Mar, 2021 20:46 IST|Sakshi

సాయిపల్లవి.. ఈ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే పాట 'వచ్చిండే, మెల్ల మెల్లగ వచ్చిండే..' కానీ 'లవ్‌ స్టోరీ' సినిమా పుణ్యాన ఇప్పుడామె పేరు చెప్తే చాలు 'దాని పేరే సారంగదరియా..' అంటూ ఫోక్‌ సాంగ్‌ను గుర్తు చేసుకుంటూ స్టెప్పులేస్తున్నారు. ఆ జానపద పాట, అందులో సాయిపల్లవి డ్యాన్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పాటే ఇంత బాగుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని సినిమా రిలీజ్‌ అయ్యే ఏప్రిల్‌ 16 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

'ఫిదా' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఈ 'లవ్‌ స్టోరీ' మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రైట్స్‌ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఆంధ్రా హక్కులు రూ.15 కోట్లకు అమ్ముడుపోగా ఓవర్సీస్‌ హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడైనట్లు టాక్‌ వినిపిస్తోంది. నైజామ్‌లో కూడా మంచి ధర పలికేది కానీ ఇక్కడ ఆసియన్‌ మూవీస్‌ సొంతంగా రిలీజ్‌ చేస్తుందట. మొత్తం‌గా ఈ సినిమా అప్పుడే 50 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసినట్లు సమాచారం. ఇవి కేవలం థియేట్రికల్‌ బిజినెస్‌ మాత్రమే కాగా, ఇవి కాకుండా నాన్‌ థియేటర్‌ హక్కులు ఉండనే ఉన్నాయి. మరి ఓవరాల్‌గా ఈ సినిమా ఎంత మార్కెటింగ్‌ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

చదవండి: సాయి పల్లవి ‘సారంగ దరియా’వచ్చేసింది

మరిన్ని వార్తలు