నాలుగు రోజుల్లోనే లాభాలొచ్చాయి

20 Jan, 2021 08:23 IST|Sakshi

‘‘నేను శైలజ’ వంటి క్లాస్‌ సినిమాతో పాటు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి మాస్‌ సినిమాలో చక్కగా నటించాడు రామ్‌. కానీ ఇప్పటివరకూ రామ్‌ ద్విపాత్రాభినయం చేయలేదు. ‘రెడ్‌’లో ఆదిత్య తో మాస్‌ ఆడియన్స్‌కి, సిద్ధార్థ క్యారెక్టర్‌తో క్లాస్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యాడు’’ అన్నారు ‘స్రవంతి’ రవికిశోర్‌. రామ్‌ హీరోగా, మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్‌’. తిరుమల కిశోర్‌ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. రవికిశోర్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 22న మలయాళంలో, ఆ తర్వాత వివిధ భాషల్లో ‘రెడ్‌’ విడుదల కానుంది. ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుందని, వసూళ్లు వస్తాయని నమ్మకం ఉండేది.. అది నిజమైంది. నాలుగు రోజుల్లోనే లాభాలు వచ్చాయి. మంచి స్క్రిప్ట్‌ వచ్చి రామ్‌ ఎగ్జయిట్‌ అయితే తప్పకుండా ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమా చేస్తాడనుకుంటున్నాను. మా బ్యానర్‌లో తర్వాతి చిత్రం ఇంకా ఫైనల్‌ కాలేదు’’ అన్నారు.

 

మరిన్ని వార్తలు