థియేటర్‌కి వెళితే కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం

24 Dec, 2020 23:57 IST|Sakshi
నివేదా పేతురాజ్, రామ్, మాళవికా శర్మ

–  రామ్‌

‘‘చాక్లెట్‌ బాయ్‌ ఇమేజ్‌ నుండి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో విశ్వరూపం చూపించి, మాస్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు రామ్‌. ఇప్పుడు ‘రెడ్‌’తో దాన్ని రెండింతలు చేసుకోనున్నాడు’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. రామ్‌ హీరోగా, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్‌’. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్‌ పతాకంపై స్రవంతి రవికిశోర్‌ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రెడ్‌’ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘చాలా సున్నితంగా, క్లాస్‌గా కనిపించే కిశోర్‌ తిరుమల ‘రెడ్‌’ చిత్రంతో తాను మాస్‌ చిత్రాలు రాయగలను, తీయగలనని నిరూపించుకున్నాడు.

రామ్‌కి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కంటే ‘రెడ్‌’ పెద్ద హిట్‌ అవ్వబోతోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం అందరికీ మంచి సక్సెస్‌ని, గుర్తింపుని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కిశోర్‌ తిరుమల. రామ్‌ మాట్లాడుతూ– ‘‘ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళతాం.. వంట చేసుకోగలిగినా హోటల్‌కి వెళుతుంటాం.. అలాగే ఎన్ని ఓటీటీ వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం. థియేటర్లలో సినిమా చూస్తూ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం. ప్రేక్షకులందరూ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్లకు రావాలని కోరుతున్నాం’’ అన్నారు. నిర్మాత కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ (దాము), నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నాజర్‌ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌ రెడ్డి.

మరిన్ని వార్తలు