ప్రతిభను ప్రోత్సహించేందుకే రెడ్డీస్‌ మల్టీప్లెక్స్‌

27 Nov, 2020 00:47 IST|Sakshi

‘‘మహిళలకు అవకాశం ఇస్తే ఎంత ఎత్తుకు అయినా ఎదుగుతారు. జగన్‌గారిని సీఎం చేయడం కోసం మహిళలుగా మేమంతా కష్టపడ్డాం. శైలజ డేరింగ్‌ స్టెప్‌ వేస్తోంది. ఈ సంస్థ నుంచి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ రావాలి.. ఇది సక్సెస్‌ కావాలి’’ అని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్‌.కె. రోజా అన్నారు. రెడ్డీస్‌ మల్టీప్లెక్స్‌ మూవీస్‌ లోగో, ఈ సంస్థకు చెందిన యూ ట్యూబ్‌ చానల్‌ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘సినిమాలు, యూ ట్యూబ్, రియల్‌ ఎస్టేట్‌.. ఇలా అన్నింటినీ ఒక పద్ధతిలో చేస్తున్నారు.

యువతరం తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు ఒక మంచి వేదిక అవుతుంది’’ అన్నారు. రెడ్డీస్‌ మల్టీప్లెక్స్‌ మూవీస్‌ చైర్మన్‌ విజయ్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే రెడ్డీస్‌ మల్టీప్లెక్స్‌ మూవీస్‌ని ప్రారంభించాం. టాలీవుడ్‌ అనే చేపల చెరువును ఆన్‌లైన్‌ అనే మహాసముద్రం మింగేస్తోంది. రీల్‌పై ఎందరు హీరోలున్నా ప్రజల హృదయాల్లో రియల్‌ హీరో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారే.. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దివంగత నేత వైయస్‌ రాజశేఖర రెడ్డిగారు కూడా ఎన్నో మంచి పనులు చేశారు’’ అన్నారు.

‘‘ఇది కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ’’ అని వైఎస్సార్‌సీపీ జనరల్‌ సెక్రటరీ, రెడ్డీస్‌ మల్టీప్లెక్స్‌ చైర్‌ పర్సన్‌ శైలజా చరణ్‌ రెడ్డి అన్నారు. ‘మనస్సాక్షి, వాయిస్‌ ఆఫ్‌ ఉమెన్, టుడే పాలిటిక్స్, కామన్‌ మ్యాన్, వైయస్‌ఆర్‌ డ్రీమ్‌ వరల్డ్, యువతరం’ అనే యూట్యూబ్‌ చానల్స్‌తో పాటు ఆర్‌ ప్లెక్స్‌ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించారు. మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, నరసింహారెడ్డి, విద్యావతి, అవినాష్‌ రెడ్డి, రవిచంద్రారెడ్డి, స్నేహ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు