Rekha boj: దరిద్రం ఏంటంటే మనవాళ్లకు ఆ హీరోయిన్సే కావాలి!

20 Oct, 2022 18:32 IST|Sakshi

టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్స్‌కు గుర్తింపు, ఛాన్సులు రెండూ తక్కువేనన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. తెలుగమ్మాయిలు తమ టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకున్నా సరే వారికి అవకాశాలు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ముందుకు రారన్న వాదన ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఇదే విషయాన్ని కుండ బద్ధలు కొట్టి చెప్పిందో తెలుగు నటి. 'దామిని విల్లా', 'రంగీలా', 'స్వాతి చినుకులు సంధ్య వేళలో' సినిమాల్లో నటించిన రేఖా బోజ్‌ సోషల్‌ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'కేజీఎఫ్‌లో శ్రీనిధి శెట్టి, కాంతారలో సప్తమి గౌడ హీరోయిన్స్‌. కన్నడ వాళ్లు కన్నడ అమ్మాయిలనే పెట్టుకుని బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చారు. ఇది చూసైనా మన దర్శకులు కాస్త మారాలి(బుద్ధి తెచ్చుకోవాలి). ఇవే కాకుండా రంగితరంగ, ముంగారుమలై, దునియా, కిరాక్ పార్టీ ఇలా చాలా సినిమాలున్నాయి. కార్తికేయ 2లో ఆ మలయాళీ కాకుండా ఒక తెలుగు అమ్మాయి ఉన్నా కూడా ఆ మూవీ అలానే ఆడుతుంది. మన సబ్జెక్ట్‌లో, మన గుండెల్లో దమ్ము ఉండాలే కానీ, ఆ నార్త్, మలయాళీ, కన్నడ అమ్మాయిలు వచ్చి ఇక్కడ చేసేది ఏం ఉండదు. డైలాగ్స్ చెప్పమంటే జీరో ఎక్స్‌ప్రెషన్స్‌తో అప్పడాలు, వొడియాలు నమిలినా కూడా మనవాళ్ళకి వాళ్ళే కావాలి.

మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే, చివరి రెండు వరుసల హీరోలు అయిన రాజ్ తరుణ్, కార్తికేయ, విశ్వక్‌ సేన్‌ లాంటి వాళ్లు.. ఇంకా లాస్ట్ హీరోలు కిరణ్ అబ్బవరం, శ్రీ సింహ, సంతోష్ శోభన్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్ల పక్కన కూడా మన తెలుగు అమ్మాయిలు లేరు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలో వాళ్లు ఆ నేటివిటీకి తగినట్లు అదే లాంగ్వేజ్ అమ్మాయిలను తీసుకుంటారు. కానీ అదే సినిమాను మనవాళ్ళు రీమేక్ చేసినప్పుడు మాత్రం మన నేటివిటీకి తెలుగు అమ్మాయిలను కాకుండా వేరే వాళ్ళను పెడతారు. అక్కడ సైడ్‌ యాక్టర్స్‌ అయిన నారప్ప, మాస్టర్ మూవీల అమ్మాయిలను మనవాళ్ళు హీరోయిన్లుగా చేసేశారు. వాళ్లసలు వాళ్ళ ఇండస్ట్రీలోనే హీరోయిన్స్ కాదు!చివరికి అందరూ అసలు సినిమాల కిందే లెక్కచేయని మా వైజాగ్ ఫిలింస్‌లో కూడా తెలుగు అమ్మాయిలకు స్థానం లేదు. ఇది మన తెలుగు సినిమాకి పట్టిన కర్మ, దరిద్రం' అని ఆగ్రహం వ్యక్తం చేసింది రేఖా బోజ్‌.

చదవండి: సంపాదన విషయంలో సుమకు, రాజీవ్‌కు గొడవలు?
62 దేశాలు, 18 నెలల.. హీరో షాకింగ్‌ నిర్ణయం

మరిన్ని వార్తలు