-

కంగ్రాట్స్‌ ఇండియా: రియా చక్రవర్తి తండ్రి

6 Sep, 2020 08:18 IST|Sakshi

రియా ఇంటికి చేరుకున్న ఎన్‌సీబీ అధికారులు

ముంబై: డ్రగ్స్‌ కేసులో తన కుమారుడిని అరెస్టు చేయడంపై నటి రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి స్పందించారు. తమ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పని చేసిన ఆయన ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కంగ్రాట్స్‌ ఇండియా, నువ్వు నా కొడుకును అరెస్టు చేశావు, ఆ తర్వాత వరుసలో నా కుమార్తె కూడా ఉందని నాకు తెలుసు. ఆ తదుపరి ఇంకెవరో తెలియదు. ఓ మధ్య తరగతి కుటుంబాన్ని సమర్థవంతంగా పడగొట్టేశారు. అయితే న్యాయం జరగాలంటే వీటన్నింటినీ మనం సమర్థించాల్సి ఉంటుంది. జై హింద్‌’’అంటూ విమర్శనాత్మక లేఖ విడుదల చేశారు. కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో అతడి ప్రేయసి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాతో పాటు ఆమె తండ్రి ఇంద్రజిత్‌, సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని కూడా దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి.(చదవండి: ‘రియా, సుశాంత్‌ కలిసి గంజాయి తాగేవారు’)

ఈ క్రమంలో డ్రగ్స్‌ వ్యవహారం బయటకు రావడంతో రియా, షోవిక్‌(24)ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఈ మేరకు శుక్రవారం వారి నివాసంలో సోదాలు జరిపిన ఎన్‌సీబీ అధికారులు షోవిక్‌ను అరెస్టు చేశారు. ఈనెల 9 వరకు తమ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా రియా చక్రవర్తి చెబితేనే తాను మాదక ద్రవ్యాలను తీసుకొచ్చేవాడినని షోవిక్‌ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్‌కే కాకుండా మరికొందరు బాలీవుడ్‌ నటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడినని అతడు విచారణలో అంగీకరించాడని పేర్కొన్నారు. (చదవండి: రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు)

దీంతో రియా చక్రవర్తి ఎప్పటి నుంచో మాదక ద్రవ్యాలు కొనడం, అమ్మడం చేస్తోందని ఆమె కాల్‌ డేటా ఆధారంగా ఎన్‌సీబీ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం రియాను విచారించి, ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక తాజా సమచారాం ప్రకారం ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే రియా ఇంటికి చేరుకున్నారు. కాగా షోవిక్‌తో పాటు ఇప్పటికే అరెస్టయిన సుశాంత్‌ ఇంటి మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండా, డ్రగ్‌ డీలర్లు కైజాన్‌ ఇబ్రహీం,  జైద్‌ విల్తారా, అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌ తదితరులను... రియా ముందు కూర్చోబెట్టి ముఖాముఖి విచారిస్తే ఒక్కొక్కరి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు