నా సొంత ఆదాయం నుంచే ఖర్చు: రియా

8 Aug, 2020 14:00 IST|Sakshi

రియాపై ఈడీ ప్రశ్నల వర్షం

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నుంచి తాను ఎన్నడూ డబ్బు తీసుకోలేదని బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి అన్నారు. తనకు సంబంధించిన ప్రతీ అవసరానికి తన ఆదాయం నుంచే ఖర్చు చేశానని వెల్లడించారు. అయితే సుశాంత్‌ ప్రారంభించిన ఓ కంపెనీలో అతడితో కలిసి తాను, తన సోదరుడు లక్ష రూపాయలు పెట్టుబడి(మూలధనం) పెట్టామని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీకి తాను ఎటువంటి చెల్లింపులు జరుపలేదని పేర్కొన్నారు. అదే విధంగా ముంబైలోని ఖర్‌(ఈస్ట్‌) ఏరియాలో తన పేరు మీద గల ఫ్లాట్‌ కోసం 60 లక్షలు హౌజింగ్‌ లోన్‌ తీసుకున్నానని, మరో 25 లక్షలు తన సొంత ఆదాయం నుంచి ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట రియా చక్రవర్తి వాంగ్మూలం నమోదు చేశారు. ( రియా వచ్చిన కారు ఎవరిదో తెలుసా!

కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా శుక్రవారం ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 8 నుంచి తొమ్మిది గంటల పాటు అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాగా సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రియా దాదాపు 15 కోట్ల రూపాయల మేర తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుందని అతడి తండ్రి కేకే సింగ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.(ఇది పూర్తిగా చట్టవిరుద్ధం: రియా చక్రవర్తి)

ఈ నేపథ్యంలో రియాతో పాటు ఆమె తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి, సోదరుడు షౌవిక్‌ చక్రవర్తితో సీఏ రితేశ్‌ షా, సుశాంత్‌ బిజినెస్‌ మేనేజర్‌ శ్రుతి మోదీ, హౌజ్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండా, స్నేహితుడు సిద్దార్థ్‌ పితానీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇక ఈ కేసులో ఇప్పటికే రియా, షౌవిక్‌లను విచారించిన ఈడీ ఆగష్టు 10 న ఇంద్రజిత్‌ చక్రవర్తిని విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుశాంత్‌ మృతి కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా కదలికలపై దృష్టి సారించింది. ఇక జూన్‌ 14న సుశాంత్‌ బాంద్రాలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు