డ్రగ్స్‌ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్‌

8 Sep, 2020 15:37 IST|Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ కేసులో ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌సీబీ తెలిపింది. సాయంత్రం 4:30 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. డ్రగ్స్‌ కేసులో  ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను ఎన్‌సీబీ నాలుగు రోజుల పాటు రియాను విచారించింది. విచారణలో ఆమె 25 మంది బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్‌‌ అయిన విషయం తెలిసిందే. కాగా సుశాంత్‌ సింగ్‌ మృతి చెందినప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చింది.  (8 గంటలు ప్రశ్నల వర్షం)

ఈ క్రమంలోనే విచారణను మరింత వేగవంత చేసిన ఎన్‌సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేశారు. రియా సూచనల మేరకు సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడని షోవిక్‌ విచారణలో వెల్లడించాడు. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్‌సీబీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్‌, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటినుంచి కీలక ఆధారాలను సేకరించారు. అలాగే డ్రగ్స్‌ స్మగ్లర్ బాసిత్‌ను ఐదు సార్లు కలిసినట్టు రియా అంగీకరించడంతో మంగళవారం అరెస్ట్‌ చేశారు.  అయితే రియా డ్రగ్‌ కేసులో బాలీవుడ్‌కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్‌సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్‌సీబీ అధికారులు సమీర్‌ వాంఖడే, కేపీఎస్‌ మల్హోత్రా ఆధ్వర్యంలో రియా విచారణ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు