Rocking Rakesh: తిండి లేక పస్తులున్నాం, ఇప్పటికీ శ్మశానానికి వెళ్తా..

25 Dec, 2022 19:34 IST|Sakshi

కామెడీ స్కిట్ల ద్వారా బుల్లితెరపై నవ్వులు పంచుతున్నారు రాకేశ్‌ - జోర్దార్‌ సుజాత. ఆన్‌స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా వీరిద్దరూ జంటపక్షులన్న విషయం తెలిసిందే!రాకేశ్‌ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అక్కడ వాలిపోతోంది సుజాత. అయితే ముందుగా సుజాతే తనను ఇష్టపడిందంటున్నాడు రాకేశ్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాకింగ్‌ రాకేశ్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 

'పెళ్లంటే నాకు మంచి అభిప్రాయం లేదు. అసలు పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదన్నాను. పెళ్లి చేసుకోకపోతే ఇంట్లోంచి వెళ్లిపోతానని బెదిరించింది అమ్మ. కానీ ఎప్పుడైతే సుజాత పరిచయమైందో అప్పుడు నా అభిప్రాయం మారింది. ముందుగా ఆమె నన్ను ఇష్టపడింది. ఇంట్లోవాళ్లకు కూడా నచ్చింది. అలా మా ప్రేమ ముందుకు సాగింది. నా కెరీర్‌ ఎలా ప్రారంభమైందంటే.. అవకాశాల కోసం వరంగల్‌ వదిలి హైదరాబాద్‌ వచ్చాను. 11 ఏళ్లు ఎన్నో ఆఫీసులు తిరిగాను. మొదట్లో మిమిక్రీ ప్రోగ్రామ్‌లు చేసుకునేవాడిని. మిమిక్రీ చేశాక పేమెంట్‌ ఇచ్చేదాకా వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడేవాళ్లం. సరిగ్గా చేయలేదని రూ.500 ఇచ్చినా అదే మహాభాగ్యమని సరిపెట్టుకునేవాడిని.

తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి కమెడియన్‌ స్థాయికి వచ్చాను. ధనరాజ్‌ నన్ను కామెడీ షోకి తీసుకెళ్లడం వల్లే నేనిప్పుడు మీ ముందు నిలబడ్డాను. రేలంగి నరసింహారావు డైరెక్షన్‌లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పుడింత గుర్తింపు, డబ్బు ఉంది కానీ ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు. ఒక్కోసారి అమ్మ పస్తులుండి మాకు తిండిపెట్టేది. అలా చాలా కష్టాలు పడ్డాం. అవన్నీ దాటుకుని ఇక్కడిదాకా వచ్చాను. అప్పుడప్పుడూ నేను శ్మశానానికి వెళ్లి అక్కడే పడుకుంటాను. అక్కడ నాకు ఎక్కడలేని ప్రశాంతత దొరుకుతుంది' అని చెప్పుకొచ్చాడు రాకింగ్‌ రాకేశ్‌.

చదవండి: ఆత్మహత్య చేసుకుందామనుకున్న చలపతిరావు

మరిన్ని వార్తలు