Sai Dharam Tej Accident: కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి: ఆర్పీ

11 Sep, 2021 15:13 IST|Sakshi

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ స్పందించారు. నిన్న సాయంత్రం ఆయన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వెంటిలెటర్‌పై చికిత్స  పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని ఆర్పీ ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా సాయిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాష్‌ డ్రైవింగ్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలగా ఆయనపై మోటరు యాక్ట్‌ కింద నిర్లక్ష్యంగా బైక్‌ నడిపినందుకు కేసు ఫైల్‌ చేశారు. దీనిపై ఆర్పీ పట్నాయక్‌ స్పందిస్తూ... యాక్సిడెంట్‌ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా కేసు పెట్టాలన్నారు.  

చదవండి: Sai Dharam Tej Accident: సాయి తేజ్‌పై కేసు నమోదు

ఈ కేసు వల్ల నగరంలో మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవాళ్లు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారని తన అభిప్రాయం అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు. రోడ్డుపై ఇసుక పేరుకుపోవడం వల్లే బైక్‌ స్కిడ్‌ అయ్యి కిందపడిపోయినట్లు మాదాపూర్‌ ఏసీసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా దుర్గం చెరువు వంతెనపై నుంచి ఐకియా వైపు తన స్పోర్ట్స్‌ బైక్‌పై నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సాయి తేజ్‌ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. 

చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్‌.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు