-

ఆర్‌ఆర్‌ఆర్‌: కథ క్లైమాక్స్‌కు వచ్చింది

19 Jan, 2021 16:33 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రణం రుధిరం). అలియాభట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ స్వయంగా వెల్లడించింది. "వాళ్లు అనుకున్నది సాధించేందుకు కొమురం భీమ్‌, సీతారామరాజు ఏకమయ్యారు. క్లైమాక్స్‌ షూటింగ్‌ మొదలయ్యింది. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది" అని సోషల్‌ మీడియాలో పేర్కొంది. చరిత్రలో ఎప్పుడూ కలవని భీమ్‌, రామరాజు దేని కోసం ఏకమై పిడికిలి బిగిస్తున్నారో సినిమా రిలీజైతేకానీ తెలీదు.

మొత్తానికి క్లైమాక్స్‌ షూటింగ్‌ మొదలు కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దర్శకేంద్రుడు రాజమౌళి మంచి శుభవార్త చెప్పారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఏడాది దసరా అప్పుడో, లేదా వచ్చే ఏడాది సంక్రాంతికో రిలీజ్‌ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో స్వాతంత్ర సమర యోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో వీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌కు అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే! (చదవండి: ఒక్క ఫోటో.. నీ కష్టం ఏంటో తెలుపుతోంది)

మరిన్ని వార్తలు