మహేశ్‌బాబుపై రాజమౌళి ప్రశంసల వర్షం.. కారణం ఇదే

21 Dec, 2021 19:04 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్న సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుపై దర్శక దిగ్గజం రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు మహేశ్‌ తీసుకున్న చొరవ అభినందనీయం అని కొనియాడారు. మహేశ్‌తో పాటు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, ఎఫ్‌ 3 మూవీ టీమ్‌ని కూడా అభినందించాడు. కాగా, పాన్‌ ఇండియా మూవీస్‌ ఆర్‌ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్‌ విడుదలను దృష్టిలో పెట్టికొని మహేశ్‌.. తాను హీరోగా నటిస్తున్న ‘‘సర్కారువారి పాట’ను 2022 సంక్రాంతి నుంచి ఏప్రిల్‌ 1కి వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే సీజన్‌లో విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్‌’, ఎఫ్‌3 చిత్రాలు కూడా విడుదల తేదీలను మార్చుకున్నాయి.

‘భీమ్లా నాయక్‌’ ఫిబ్రవరి 25కి, ‘ఎఫ్‌ 3’ చిత్రాలను ఏప్రిల్‌ 29కి వాయిదా వేశారు. ఈ మూడు చిత్రాల మేకర్స్‌ తీసుకున్న నిర్ణయంపై రాజమౌళి హర్షం వ్యక్తం చేశాడు. ‘సంక్రాంతి సీజన్‌కు రావాల్సిన సరైన సినిమా ‘సర్కారు వారి పాట’. కానీ చిత్ర సీమలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మహేశ్‌ బాబు తన చిత్రాన్ని వేసవికి వాయిదా వేసుకున్నారు. ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా చూసేందుకు మహేశ్‌ తీసుకున్న చొరవ అభినందనీయం’అని రాజమౌళి ట్వీట్‌ చేశాడు. అలాగే భీమ్లా నాయక్‌, ఎఫ్‌3 బృందాలకు కూడా ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. 


ఆర్‌ఆర్‌ఆర్‌ విషయానికొస్తే.. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా చిత్రం..  2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కొమరమ్‌ భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలు పోషిస్తున్నారు. చెర్రీకి జోడిగా  బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ నటించగా, తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటించారు.

మరిన్ని వార్తలు