RRR Movie: కరోనా మహమ్మారి దెబ్బకు దేశం అతలాకుతలం అవుతోంది. రోజుకు లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఆసుపత్రల్లో ఎక్కడ చూసినా కరోనా బాధితులే కనిపిస్తున్నారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మాస్కులు, శానిటైజర్లు వాడాలని వైద్యులతో పాటు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.
తాజాగా పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్తో పాటు హీరోయిన్ అలియాభట్, దర్శకుడు రాజమౌళి వివిధ భాషల్లో ప్రజలకు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాట్లాడిన వీడియోను యూట్యూబ్లో #StandTogether పేరుతో పంచుకుంది. అందులో ఆలియా భట్ తెలుగులో.. రామ్చరణ్ తమిళంలో.. ఎన్టీఆర్ కన్నడలో.. రాజమౌళి మలయాళంలో.. అజయ్దేవ్గణ్ హిందీలో మాట్లాడుతూ.. కరోనాపై జాగ్రత్తలు చెప్పారు. అందరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, మాస్క్ లు, శానిటైజర్లు వాడాలని అలాగే భౌతిక దురాన్ని పాటించాలని కోరారు. మనకోసం, మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం, చుట్టూ ఉన్నవారికోసం, దేశం కోసం జాగ్రత్తలు వహించాలని విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రాల ప్రజలకు తమ సందేశం చేరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.