RRR: సీక్వెల్‌కి కొన్ని ఐడియాలు చెప్పా.. ఎన్టీఆర్‌కు నచ్చాయి

2 Apr, 2022 10:52 IST|Sakshi

దేశవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హవా కొనసాగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటించారు. తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేశారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  కీరవాణి సంగీతం సమకూర్చగా, కథను విజయేంద్రప్రసాద్‌(రాజమౌళి తండ్రి) అందించాడు.

మార్చి 25న విడుదలైన ఈ పాన్‌ ఇండియా మూవీ రికార్డులే టార్గెట్‌గా దూసుకెళ్తోంది . జక్కన్న మ్యాజిక్‌.. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల పవర్‌పుల్‌ యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు 710 కోట్ల(గ్రాస్‌) రూపాయల వసూళ్ల రాబట్టి.. సరికొత్త రికార్డుని సృష్టించింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ కొనసాగింపు ఉంటే కూడా బాగుంటుందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌పై కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఓ రోజు ఎన్టీఆర్‌ మా ఇంటికి వచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ గురించి అడిగాడు. నేను కొన్ని ఐడియాలను చెప్పాను. అవి ఎన్టీఆర్‌, రాజమౌళికి బాగా నచ్చాయి. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో సీక్వెల్‌ రావొచ్చు’అని విజయేంద్రప్రసాద్‌ చెప్పుకొచ్చారు. ఇక మహేశ్‌బాబు సినిమాను రూ.800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట కదా అని అడగ్గా.. ఇంకా కథే సిద్ధం చేయలేదు..అప్పుడే బడ్జెట్‌ ఎలా అంచానా వేస్తాం. అదంతా అబద్దమే. కథ సిద్ధం చేస్తున్నా’అని అన్నారు. 

మరిన్ని వార్తలు