Sai Dharam Tej: తాగి వచ్చావా, మాట పోయిందా? అని దారుణంగా..

2 Apr, 2023 16:31 IST|Sakshi

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తన సొంత టాలెంట్‌తో నిలదొక్కుకున్న హీరోల్లో సాయిధరమ్‌ తేజ్‌ ఒకరు. అతడు ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. సాయిధరమ్‌ తేజ్‌ కెమెరా ముందు నటించిన మొదటి సినిమా రేయ్‌. కానీ ఫస్ట్‌ రిలీజైంది మాత్రం పిల్లా నువ్వు లేని జీవితం. ఆ మరుసటి ఏడాది రేయ్‌ విడుదలైంది. తర్వాత హిట్టూఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. రెండేళ్ల క్రితం రిపబ్లిక్‌తో అలరించిన ఆయన అదే ఏడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న తర్వాతే తిరిగి సినిమాలు మొదలు పెట్టాడు. తాజా ఇంటర్వ్యూలో సాయిధరమ్‌ తేజ్‌ తన యాక్సిడెంట్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

'నేను పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది. ఇంతలో సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే నీ పనైపోయిందా, రిటైర్‌మెంట్‌ తీసుకున్నావా? అంటూ జోకులు వేశారు. నేనేమైనా కావాలని గ్యాప్‌ తీసుకున్నానా? యాక్సిడెంట్‌ అవడం వల్ల బ్రేక్‌ వచ్చింది. అప్పుడు నేను ఖాళీగా ఉండకుండా పుస్తకాలు ఎక్కువగా చదివాను. బొమ్మలతో ఆడుకునేవాడిని. కానీ ఈ ప్రమాదం వల్ల నాకు మాట విలువ బాగా తెలిసి వచ్చింది. లొడలొడా వాగే నాకు యాక్సిడెంట్‌ వల్ల ఒక్కసారిగా మాట పడిపోయింది. జనాలేమో వీడు తాగేసి మాట్లాడుతున్నాడంటూ జోక్‌ చేశారు. కానీ గొంతు పెగిలి మాట రావడం లేదని ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అప్పుడు మాట విలువ నాకు బాగా తెలిసొచ్చింది.

ఆ సమయంలో నా చుట్టుపక్కలవాళ్లు నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. నేను చెప్పేది అర్థం కాకపోతే.. నాన్న అర్థం అవలేదు, మళ్లీ చెప్పు అనేవారు. రిపబ్లిక్‌లో నాలుగు పేజీల డైలాగ్‌ అవలీలగా చెప్పిన నాకు సగం పేజీ డైలాగ్‌ చెప్పడానికి కూడా నోరు తిరగలేదు. తోటి యాక్టర్లు కూడా చాలా సపోర్ట్‌ చేశారు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం మందు తాగి వచ్చావా? మాట పోయిందా? అని జోకులు పేల్చేవారు. కానీ ఇదంతా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు' అని చెప్పుకొచ్చాడు. సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం విరూపాక్ష చిత్రం చేస్తున్నాడు. సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో సాయిచంద్‌, బ్రహ్మాజీ, రాజీవ్‌ కనకాల, సునీల్‌, అజయ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 21న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు