సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా టైటిల్‌ ఫిక్స్‌..

25 Jan, 2021 20:03 IST|Sakshi

దేవకట్టా దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఓ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేస్తూ సోమవారం మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘రిపబ్లిక్ ఇన్ టు పబ్లిక్’ అంటూ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు జనవరి 26, రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా సాయి ధరమ్‌ తేజ్‌ వాయిస్ ఓవర్ ఈ మోషన్ పోస్టర్‌కు ప్రధానాకర్షణగా నిలిచింది. ‘యువరానర్.. ప్ర‌జ‌లు ఎన్నుకున్న రాజకీయ నాయ‌కులు.. శాస‌నాల‌ను అమ‌లు చేసే ప్ర‌భుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు దిద్దుకుంటూ క్ర‌మ‌బ‌ద్దంగా సాగిన‌పుడే అది ప్ర‌జాస్వామ్యం అవుతుంది.. ప్ర‌భుత్వం అవుతుంది.. అదే అస‌లైన రిప‌బ్లిక్’ అంటూ కోర్టు రూమ్‌లో సాయి ధ‌ర‌మ్ వాయిస్ ఓవ‌ర్ అదిరిపోయింది. చదవండి: ఆచార్య: రామ్‌ చరణ్‌కు జోడీ కుదిరింది

దీనికి తోడు గుర్రాలను చూపిస్తూ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత దేవా క‌ట్టా నుంచి వస్తున్న పొలిటికల్ సినిమా ఇది. ఈ సినిమా పూర్తిగా రాజకీయాలు, ప్ర‌జాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన బాలీవుడ్‌ హీరో

కాగా గత రెండేళ్లుగా సాయి వరస విజయాలు అందుకుంటున్నాడు. 2019లో చిత్రలహరి సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన ఈ యువ హీరో.. అదే ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే అంటూ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా పర్వాలేదనిపించింది. ఇప్పుడు రిపబ్లిక్ అంటూ మరోసారి పోటీకి సిద్ధమయ్యాడు.

మరిన్ని వార్తలు