-
వచ్చే నెలలో సాయి ధరమ్ తేజ్ సినిమా విడుదల
థియేటర్లో రిలీజ్ చేయనున్న జీ స్టూడియోస్!
కరోనా కట్టడికై విధించిన లాక్డౌన్ దెబ్బకు థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అనేకానేక చిన్న చిత్రాలతో పాటు ‘మహానటి’ కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’, మిస్ ఇండియా, అనుష్క ‘నిశ్శబ్దం’ తదితర సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ఫాంలో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో థియేటర్లు తెరిచే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ‘జీ’ ఛానెల్ సరికొత్త పంథాను ఎంచుకుంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. విడుదలకు సంబంధించిన అన్ని రకాల హక్కులు సొంతం చేసుకుంది. (చదవండి: నా సినిమాల్లో అన్నయ్య ప్రమేయం ఉండదు)
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్పై రూపొందిన ఈ సినిమా థియేటరికల్, డిజిటల్, సాటిలైట్ హక్కులు పొందింది. ఈ మేరకు డిసెంబరులో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను తొలుత థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు జీ స్టూడియోస్ ఓ ప్రకటలో తెలిపింది. అనంతరం జీ5(ఓటీటీ ప్లాట్ఫాం) సహా బుల్లితెరపై ప్రదర్శించనున్నట్లు పేర్కొంది. కాగా సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాతో సుబ్బు డైరెక్టర్గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. తొలుత మే 1న సినిమాను విడుదల చేయాలని భావించినా లాక్డౌన్ కారణంగా వాయిదా పడగా.. జీ తాజా ప్రకటనతో సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
This isn't your typical rom-com, this unique entertainer is full of quirks! 😄
Presenting #SoloBrathukeSoBetter, an @SVCCofficial production starring the powerhouse of talent @IamSaiDharamTej and @NabhaNatesh.
— Zee Studios (@ZeeStudios_) November 18, 2020
In cinemas this December! pic.twitter.com/NdPQNHX99k