తెరుచుకున్న థియేటర్‌లు.. సినిమా చూసిన మెగా హీరో

4 Dec, 2020 14:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గత మార్చిలో మూతపడిన హైదరాబాద్‌ సినిమా థియేటర్‌లు నేటి నుంచి తిరిగి తెరుచుకున్నాయి. దీంతో చాలా రోజుల తర్వాత బిగ్‌స్రీన్‌పై సినిమా చూసేందుకు సామాన్య ప్రజలంతా ఉత్సుకతతో ఉన్నారు. అయితే దీనికి సెలబ్రెటీలు మినహాయింపు కాదు. దాదాపు 8 నెలలు తర్వాత థియేటర్‌లు తెరుచుకోవడంతో హీరో సాయిధరమ్‌ తేజ్‌ సినిమా చూసేందుకు రెడీ అయిపోయాడు. ప్రసాద్‌ మల్టీప్టెక్స్‌ ఐమ్యాక్స్‌లో ఇవాళ విడుదలైన ‘టెనెట్’‌ సినిమా చూసేందుకు వెళుతున్న వీడియోను శుక్రవారం ఉదయం తన ట్వీటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ఈ రోజే థియేటర్‌లు తెరుచుకోవడం.. హాలీవుడ్‌ సినిమా 'టెనెట్‌' కూడా  విడుదల కావడంతో లాక్‌డౌన్‌ తర్వాత హైదరాబాద్‌ బిగ్‌స్రీన్‌ఫైకి వచ్చిన మొదటి చిత్రం అయ్యింది. దీంతో హాలీవుడ్‌ చిత్రం చూసేందుకు.. తేజ్‌ తన ఇంటి నుంచి బయలుదేరి ఆ తర్వాత థియేటర్‌లో అడుగుపెడుతున్న దృశ్యాన్ని వీడియో రూపంలో పంచుకున్నాడు. (చదవండి: ప్రభాస్‌ ‘సలార్’‌ టైటిల్‌ అర్థం ఏంటేంటే..)

ఇక ఈ వీడియో చివరిలో తేజ్‌ మాట్లాడుతూ.. దాదాపు ఎనిమిది నెలల తర్వాత వెండితెరపై సినిమా చూడటం కొత్త అనుభూతిని ఇస్తుందని ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తిరిగి థియేటర్లకు రావాలని కోరాడు. ‘చాలాకాలం తర్వాత థియేటర్‌కు రావడం సంతోషంగా ఉంది. బిగ్‌స్రీన్‌పై సినిమాను చూడటమంటేనే అద్భుతమైన వినోదం. చాలామంది కూడా ఇలానే భావిస్తారు. సినిమాను మళ్లీ సెలబ్రేట్‌ చేసుకుందాం’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే థియేటర్‌కు వచ్చే ముందు ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలని,  చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలని తేజ్‌ సూచించాడు. సాయి ధరమ్‌ తేజ్‌తో పాటు దర్శకుడు మారుతి కూడా ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కు వచ్చి సినిమా చూశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...తాము సినిమాకు వచ్చామని, తిరిగి థియేటర్లకు వస్తుంటే, మళ్లీ తమ జీవితాల్లోకి వచ్చిన అనుభూతినిస్తుందన్నారు. ప్రేక్షకులంతా కూడా థియేటర్లలో సినిమాలు చూసి ఎంజాయ్‌ చేయాలని ఆయన పిలుపునిచ్చాడు. (చదవండి: అనసూయ ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’)

మరిన్ని వార్తలు