సాయి తేజ్‌ పేరుతో మోసం.. నమ్మకండి అంటూ సుప్రీం హీరో విజ్ఞప్తి

30 Apr, 2021 21:06 IST|Sakshi

ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త తరహాలో మోసాలలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. పేదోడు, ఉన్నోడు అని తేడా లేకుండా అందినకాడికి దోచుకుంటున్నారు.  వాట్సాప్‌, ఫేస్‌బుక్కుల్లో ఒకరి పేరుని వాడుకుని కొందరు సైబర్‌ దొంగల ముఠా డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖుల పేర్లతో చాటింగ్‌ చేసి ఆపదలో ఉన్నామంటూ, అర్జెంట్‌గా డబ్బులు అవసరమని చెప్పి మోసాలకు పాల్పడడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. తాజాగా సాయిధరమ్‌ తేజ్‌ని కూడా సైబర్‌ నేరగాళ్లు వదలేదు. ఆయన పేరుతో ఓ సైబర్‌ నేరగాడు డబ్బులు వసూలు చేయబోయాడు. తాను సాయిధరమ్‌ తేజ్‌ని అని ,15000 కావాలని ఓ ఫ్రెండ్‌ని అడుగుతున్నట్టుగా ఓ వాట్సాప్‌ చాట్‌ని తాజాగా సాయి తేజ్‌ పంచుకున్నారు. ఇలాంటి నేరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు.

‘నా పేరు మీదుగా నేను నటించిన కో ఆర్టిస్ట్, ఇతర సభ్యుల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తున్నారని నాకు తెలిసింది. నాకు ఆర్థిక సాయం కావాలని వారిని డబ్బులు అడుగుతున్నానట. ఈ విషయంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.. అలాంటి వాటిని నమ్మకండి.. నా పేరు మీద వచ్చే మెసెజ్‌లను పట్టించుకోకండి’ అని సాయి తేజ్‌ ట్వీట్‌ చేశారు.

ఇక ఈ విషయంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలా మోసం చేసేవాడికైనా సిగ్గు ఉండాలి.. డబ్బులు పంపేవాడికైనా సిగ్గుండాలి.. మెగా హీరోని కేవలం 15వేలు అడగడం ఏంటి? అయినా అంత తక్కువ అడిగితే ఎలా నమ్ముతారనుకున్నాడు? అని సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని వార్తలు