ఆ విషయంలో బాధగా ఉంది!

21 Dec, 2020 03:42 IST|Sakshi

‘‘కోవిడ్‌ నుంచి మనల్ని రక్షించడానికి చాలామంది శ్రమిస్తున్నారు. అందులో డాక్టర్లు కూడా ఉన్నారు. ఈ సమయంలో నా డాక్టర్‌ చదువు ఉపయోగపడలేదే అని చాలా బాధపడ్డాను’’ అన్నారు సాయి పల్లవి. యాక్టింగ్‌తో పాటు సాయి పల్లవి దగ్గర మెడిసిన్‌ చదువు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య లాక్‌డౌన్‌లో మెడిసిన్‌కి సంబంధించిన ఓ పరీక్ష రాయడానికి కూడా వెళ్లారామె.

ఈ ఎగ్జామ్‌ గురించి సాయి పల్లవి మాట్లాడుతూ – ‘‘నేను చదివిన మెడిసిన్‌ మొతాన్ని మర్చిపోతున్నాను అని లాక్‌డౌన్‌లో అర్థం అయింది. నాలుగేళ్ల నుంచి పుస్తకాలే పట్టుకోలేదు. ఆరేళ్లు కష్టపడి చదివింది ఇలా వృథా కావడం కరెక్ట్‌ కాదనిపించింది. అందుకే లాక్‌డౌన్‌లో మళ్లీ చదవడం మొదలెట్టాను. లాక్‌డౌన్‌లో నేను రాసిన పరీక్ష ముందే రాసి ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైద్య సేవలకు ఏదో విధంగా ఉపయోగపడేదాన్ని. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడలేదే అని చాలా బాధగా ఉంది’’ అన్నారు సాయిపల్లవి.  

మరిన్ని వార్తలు