Sai Pallavi : స్టేజ్‌ మీద సాయి పల్లవి కన్నీళ్లు.. కారణం ఏంటంటే

19 Dec, 2021 13:30 IST|Sakshi

నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతీశెట్టి, మడోనా సెబాస్టియన్‌ హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో సాయి పల్లవి మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయింది​. తనను ఎంతగానే ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. 

‘పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు క్షమించండి. ఈరోజు మీ అందరూ నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే భావోద్వేగానికి గురవుతున్నాను. ఈ సినిమా గురించి ఎంతో చెప్పాలని ఉన్నా భావోద్వేగంతో మాటలు రావడం లేదు. ‘యాక్టర్, డ్యాన్సర్‌ కావాలని చాలామందికి ఉంటుంది.. కానీ అందరికీ అవకాశాలు రావు. నన్ను నమ్మి నాకు అవకాశాలు ఇస్తున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఆస్కార్‌ లేదా జాతీయస్థాయి అవార్డు వచ్చినప్పుడు నేను ఎమోషనల్‌ అవుతానేమోనని అనుకున్నాను. కానీ ఓ యాక్టర్‌గా ఈ ఆర్ట్‌ ఫామ్‌లో ఉండటమే నాకు పెద్ద అవార్డు. స్టేజ్ మీద ఉంటే.. ఫైర్, బేబమ్మ, భానుమతి, ఫిదా అంటూ ప్రేక్షకులు అరుస్తున్నారు. ఇలాంటి ప్రశంసలు అందుకోవడం చాలా ఎమోషనల్‌గా ఉంది. ఇలాంటి గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి, నా తల్లి దండ్రులకు థ్యాంక్స్ చెబుతున్నా’అంటూ  సాయి పల్లవి ఎమోషనల్‌ అయింది. పక్కనే ఉన్న నాని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. సాయి పల్లవి కన్నీరు పెట్టుకోవడం చూసి ప్రేక్షకులూ భావోద్వేగానికి లోనయ్యారు.

మరిన్ని వార్తలు