సాయిపల్లవి కట్టిన చీర ధరెంతో తెలుసా?

6 Jun, 2021 08:57 IST|Sakshi

నేచ్యురల్‌ బ్యూటీ..సహజ నటి.. ఈ రెండూ కలిస్తే సాయి పల్లవి. డైలాగ్‌ అయినా డాన్స్‌ అయినా అదిరిపోవాల్సిందే. స్క్రీన్‌ ఆఫ్‌ అయినా ఆ అభినయం వెంటాడాల్సిందే. ఇక్కడ ఆమె అందంతో పోటీపడుతున్న బ్రాండ్స్‌ ఏంటో చూద్దాం... 

డిజైనర్‌  మృణాళినీ రావ్‌
హైదరాబాద్‌ పుట్టిపెరిగిన మృణాళినీ రావ్‌ డాక్టర్‌ కావాలనుకుంది. కానీ ఫ్యాషన్‌ మీద ఇష్టం ఏర్పడడంతో ఆ రంగం వైపు అడుగులు వేసింది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌  కోర్సు పూర్తయ్యాక ఇంట్లోనే సృజనకు మెరుగులు దిద్దుకుంటూ ఆ డిజైన్స్‌ను ఎక్స్‌బిషన్స్‌లో ప్రదర్శించేది. 2014లో ‘మృణాళిని’ పేరుతో హైదరాబాద్‌లో ఓ బొటిక్‌ను ప్రారంభించింది. సందర్భానికి తగ్గట్టు కస్టమర్‌కు నచ్చే, నప్పే డ్రెస్‌లను డిజైన్‌ చేయటం ఆమె ప్రత్యేకత. అతికొద్ది కాలంలోనే ఆమె డిజైన్స్‌ పాపులరై కాజల్, సమంత, మెహరీన్, మంచు లక్ష్మీ  వంటి సెలబ్రెటీస్‌కు డిజైన్‌ చేసే అవకాశాన్నిచ్చాయి.  ప్రస్తుతం ఇండియన్‌ టాప్‌  డిజైనర్స్‌లో మృణాళిని ఒకరు.  పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లలో మృణాళిని రావ్‌  డిజైన్స్‌ లభిస్తాయి. 

అమ్రపాలి జ్యూయెలరీ 
ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటే ఇదే. ఈ బ్రాండ్‌లో ప్రసిద్ధ డిజైనర్స్‌ రూపొందించిన జ్యుయెలరీ దొరకదు. చరిత్రలో కలిసిపోయిన పేరు తెలియని కళానైపుణ్యులు రూపొందించిన ఆభరణాలు దొరుకుతాయి. ఇదే వీరి బ్రాండ్‌ వాల్యూ. రాజీవ్‌ అరోరా, రాజేష్‌ అజమేరా అనే మిత్రులు చరిత్రలో కలిసిపోయిన కళను అన్వేషించి.. రాజపుత్రుల నుంచి అడవి ముద్దుబిడ్డలైన గిరిజన ప్రాంత ప్రజల వరకు వారి  కళను, వారు ధరించే ఆభరణాలను చాలా వరకు పునరుద్ధరించగలిగారు. వాటిని ఆధునిక తరానికి చూపించాలనే ఉద్దేశంతో జైపూర్‌లో ‘అమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియంను ప్రారంభించారు. సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి వాటినే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. డిజైన్‌ మాత్రమే యాంటిక్‌ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్‌ యాంటిక్‌ పీస్‌ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. అమ్రపాలికి ఆన్‌లైన్‌ మార్కెట్టూ విస్తృతమే.

చీర..
డిజైనర్‌ :  మృణాళినీ రావ్‌
ధర: రూ. 1,12,000

ఇయరింగ్స్‌.. 
బ్రాండ్‌:  అమ్రపాలి జ్యూయెల్స్‌ 
ధర: రూ. 5,356

అందరమ్మాయిల్లా మొహం మీది మొటిమలకు నేనూ కలవరపడ్డాను. ఎన్నో క్రీములు వాడాను. కానీ ‘ప్రేమమ్‌’ సినిమా తర్వాత అభిమానులు పెరగడంతో నన్ను నన్నుగానే రిసీవ్‌ చేసుకుంటున్నారని అర్థమైంది. అత్మస్థయిర్యాన్ని మించిన అందం లేదని గ్రహించాను. 
– సాయి పల్లవి.

చదవండి: ఆనందయ్య మందు వాడాను, ఇప్పటి వరకు కరోనా రాలేదు: జగపతి బాబు

మరిన్ని వార్తలు