రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సైదులు. కె.ఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 1980 లో తెలంగాణ నేపధ్యంలో జరిగిన కథ ఇది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేజర్ చిత్ర దర్శకుడు శశి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైదులు సినిమా ట్రైలర్ రియాలిటీకీ దగ్గరగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని పేర్కొంటూ బెస్ట్ విషెస్ను తెలియజేశారు. నిర్మాత మరబత్తుల బ్రహ్మానందం మాట్లాడుతూ... డైరెక్టర్ బాబా చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశాం. ఆయన సినిమాను బాగా తీశారు. సినిమా మంచి విజయం సాధించి డైరెక్టర్ కు మంచి పేరుతో పాటు మరెన్నో అవకాశాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.