క్షమాపణలు చెప్పిన సైఫ్‌ అలీఖాన్‌

6 Dec, 2020 19:42 IST|Sakshi

ప్రభాస్‌ ముఖ్య పాత్రలో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించనున్నారు. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా నటించబోతున్నాడు. ఈ చిత్రం గురించి ఇటీవల సైఫ్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ.. అస‌లు రాముడితో రావ‌ణుడు యుద్ధం ఎందుకు చేశాడు? అది ఒప్పే అనే కోణంలో సినిమా ఉంటుంద‌ని చెప్పేశాడు. అలాగే రావణాసురుడిలోని మానవత్వా కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నామన్నారు.

ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిందువులు రాక్షసుడిగా భావించే రావణాసురుడిని సైప్‌ అలీఖాన్‌ పొగడటం ఆ వార్గానికి మింగుడుపటడం లేదు. ఆయన వ్యాఖ్యలపై హిందు సంఘాలతో పాటు బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీ నాయ‌కుడు రామ్‌క‌దం.. సైఫ్ అలీఖాన్ వ్యాఖ్యలు త‌న‌ను షాక్‌కు గురి చేశాయంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు రావ‌ణాసురుడిని మంచివాడుగా చూపిస్తే అస్స‌లు ఊరుకోమ‌ని హెచ్చరించాడు. 
(చదవండి : వాళ్లు ప‌దేళ్లు స‌హ‌జీవ‌నం చేశారు: ప్ర‌ముఖ సింగ‌ర్‌)

దీనిపై స్పందించిన సైఫ్‌ అలీఖాన్‌.. ఇతరుల మనోభావలను దెబ్బతీసే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించమని కోరారు. ‘నేను ఇటీవల చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించమని కోరుతున్నా. నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నారు. రాముడు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. వీర‌త్వానికి, ధ‌ర్మానికి గుర్తుగా రాముడిని భావిస్తా. క‌థ‌ను వ‌క్రీక‌రించ‌కుండా చెడుపై మంచి సాధించిన విజ‌యాన్ని ‘ఆదిపురుష్‌’లో చూపించనున్నారు’ అని సైఫ్‌ అలీఖాన్‌ తెలిపారు.

వచ్చే ఏడాది జనవరిలో  ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2022 ఆగస్ట్‌ 11న ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది.

మరిన్ని వార్తలు