సైఫ్‌ వెబ్‌ సిరీస్‌ ‘తాండవ్’‌ టీజర్‌ విడుదల

17 Dec, 2020 15:06 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్న వెబ్ సిరీస్‌ ‘తాండవ్‌’ టీజర్‌ గురువారం విడుదలైంది. హిమాన్షు కిషన్‌ మెహ్రా దర్శకత్వం వహిస్తుండగా, అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్‌ నేపథ్యంలో సాగే ఈ  చిత్రంలో సైఫ్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఇక టీజర్‌ విషయానికొస్తే.. భారతదేశాన్ని నడిపించేది ముఖ్యంగా రాజకీయాలు అంటూ మొదలవుతుంది. ఆ తర్వాత పెద్ద జన సముహం పార్టీ జెండా పట్టుకుని జైజైలు కొడుతుండగా.. వైట్‌ షర్ట్‌, వెస్ట్‌ ధరించి రాజకీయ వేత్తగా సైఫ్‌ ఇచ్చిన ఎంట్రీ ఈ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజల ఎదురుగా వచ్చి  రాజకీయ నేతగా అభివాదం చేసుకుంటు ముందుకు నడుచుకుంటూ వస్తుండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్‌ ‘హిందూస్తాన్‌ను నడిపించేది ఒకే ఒకటి... అది రాజనీతి‌’ అని వినిపిస్తుంది. తొమ్మిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌ జనవరి 15న ఓటీటీ ప్లాట్‌ఫాం ఆమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. 

దేశ రాజకీయాల‌ నేపథ్యంలో సాగే ఈ వెబ్‌ సిరీస్‌లో డింపుల్ కపాడియా, తిగ్మాంషు ధులియా, సునీల్ గ్రోవర్‌లు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక కుముద్ మిశ్రా, మహ్మద్ జీషన్ అయూబ్, కృతికా కమ్రా, గౌహర్ ఖాన్, అనుప్ సోని తదితరులు కూడా నటిస్తున్నారు. ఇందులో సైఫ్‌ పవర్‌ఫుల్‌ రాజకీయ నేతగా కనిపించనున్నారు. కాగా ప్రస్తుతం సైఫ్‌ టాలీవుడ్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఆదిపురుష్‌ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పౌరాణిక నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తుండగా.. సైఫ్‌ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పాత్రపై చేసిన వ్యాఖ్యలకు పరిశ్రమలో తీవ్ర దుమారం రేగడంతో ఇటీవల సైఫ్‌ క్షమాపణలు కోరాడు. అయినప్పటికి అతడి వ్యాఖ్యలు రావణుడిని ప్రశంసిస్తున్నట్లు ఉండటంతో యూపీకి చెందిన ఓ న్యాయవాది.. సైఫ్‌తో పాటు దర్శకుడుపై కోర్టులో పిటిషన్‌ వేశారు.

మరిన్ని వార్తలు