2022లో దర్శకత్వం చేస్తా

29 May, 2021 00:00 IST|Sakshi
నిర్మాత యం. రాజశేఖర్‌ రెడ్డి

‘‘నాది గుంటూరు. ఇంజనీరింగ్‌ చదివేందుకు చెన్నై వెళ్లాను. అక్కడికి వెళ్లాక సినిమాలపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ నాకు మంచి స్నేహితుడు. తన టేకింగ్‌ విధానం, కథ చెప్పే తీరు చూసి నేను కూడా డైరెక్టర్‌ అవ్వాలనుకున్నాను. అంతకంటే ముందు ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేద్దామని నిర్మాతగా మారాను’’ అని యం. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. ‘ప్రేమలో పడితే’, ‘నకిలీ’ వంటి డబ్బింగ్‌ చిత్రాలతో పాటు ‘త్రిపుర’ సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన రాజశేఖర్‌ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తమిళంలో ‘శైవం’ చిత్రాన్ని నిర్మించి విజయం అందుకున్నాను. తెలుగులో స్ట్రయిట్‌గా ‘త్రిపుర’ చిత్రాన్ని నిర్మించాను. ‘ఓ మై ఫ్రెండ్‌’ చిత్రాన్ని ‘శ్రీధర్‌’ పేరుతో, ‘కేరాఫ్‌ కంచరపాలెం’ చిత్రాన్ని ‘కేరాఫ్‌ కాదల్‌’ పేరుతో తమిళంలో రీమేక్‌ చేశాను.

ఈ ఏడాది నా సినిమాలు నాలుగింటిలో ‘కేరాఫ్‌ కాదల్‌’ విడుదలవగా ‘జ్వాలా, క్లాప్, అక్టోబర్‌ 31’ వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాలు తెలుగు–తమిళ భాషల్లో రూపొందినవే. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అక్టోబర్‌ 31’ చిత్రం 8 రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. విశ్వక్‌సేన్, మేఘా ఆకాశ్, నివేదా పేతురాజ్, మంజిమా మోహన్, రెబ్బా జా¯Œ  ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ‘జ్వాలా, క్లాప్, అక్టోబర్‌ 31’ సినిమాలను ఈ ఏడాది వరుసగా జూలై, ఆగస్టు, సెప్టెంబరులో విడుదల చేయాలనుకుంటున్నాను. ఓ ప్రముఖ ఓటీటీ కోసం వెబ్‌సిరీస్‌ను నిర్మించనున్నా. 2022లో నేను దర్శకత్వం వహిస్తా.. ఈ చిత్రానికి కూడా నేనే నిర్మాతను. ప్రస్తుతం కరోనా కాలంలో నా వంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 11 లక్షలు విరాళం అందించాను. ఆపదలో ఉన్న స్నేహితులను ఆసుపత్రిలో చేర్పించి, వారి అవసరాలు తీర్చి ఆసరాగా ఉన్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు