Salman Khan: మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్.. అభిమానులకు పిలుపు

22 Jun, 2022 18:19 IST|Sakshi

Salman Khan Participate In Green India Challenge 5.0: ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ ను అందిస్తుందన్నారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన  “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0”లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. తర్వాత సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలి. అని కోరారు. 

ఇంకా సల్మాన్‌ మాట్లాడుతూ అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఈ పనికి జోగినిపల్లి సంతోష్ కుమార్  “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా బాటలు వేసారని.. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని సల్మాన్‌ తెలిపారు. నా అభిమానులంతా విధిగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

(చదవండి: కమెడియన్‌ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..)

అనంతరం రాజ్యసభ సభ్యుడు, జోగినిపల్లి సంతోష్  కుమార్ మాట్లాడుతూ 'పెద్ద మనసుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు. మీరు మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుంది' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా హిట్‌ లిస్ట్‌లో కరణ్‌ జోహార్‌..)

మరిన్ని వార్తలు