Salman Khan: పంజాబ్‌ ర్యాపర్‌ హత్య, సల్మాన్‌ ఖాన్‌కు భద్రత పెంపు

1 Jun, 2022 21:01 IST|Sakshi

పంజాబ్‌ ర్యాపర్‌, సింగర్‌ సిద్ధూ మూసేవాలా గ్యాంగ్‌వార్‌కు బలైన విషయం తెలిసిందే. ఆయన్ను హత్య చేసింది తామేనని లారెన్స్‌ బిష్ణోయ్ ముఠాకు చెందినవాళ్లు ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతుండగా 2018లో బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామంటూ లారెన్స్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మరోసారి వైరల్‌గా మారింది. కృష్ణ జింకను దైవంగా భావించే బిష్ణోయ్‌.. కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని కోర్టు ఆవరణలోనే సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఈమేరకు సల్మాన్‌ హత్యకు ప్లాన్‌ చేసి అతడి ఇంట్లో రెక్కీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఇక ఇటీవల తీహార్‌ జైలులోనే ఉండి సింగర్‌ సిద్ధూని చంపాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు సల్మాన్‌ ఖాన్‌కు భద్రత పెంచారు. పంజాబీ సింగర్‌ సిద్ధూ హత్యకు గురైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు హీరో ఇంటివద్ద అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చదవండి: ఎవరీ కేకే, ఆయనకంటే మేమే బాగా పాడతామన్న సింగర్‌.. నెట్టింట ట్రోలింగ్‌
ఆకట్టుకుంటున్న బ్రహ్మాస్త్ర కొత్త టీజర్‌, నాగార్జున లుక్‌ రిలీజ్‌

మరిన్ని వార్తలు