Samanatha: చైతో విడాకులు.. నేనేదో నేరం చేసినట్లు ఇంట్లో ఎందుకు దాక్కోవాలి?

29 Mar, 2023 14:31 IST|Sakshi

ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. పాటతో ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది సమంత. సామ్‌ను ఆ పాటలో చూసి ఎంతోమంది షాకయ్యారు. స్టార్‌ హీరోయిన్‌ అయి ఉండి ఐటమ్‌ సాంగ్‌ చేయడం అవసరమా? అని ట్రోల్‌ చేశారు. పైగా నాగచైతన్యతో విడిపోయిన సమయంలో ఇలాంటి పాటలు సెలక్ట్‌ చేసుకోవడం ఎందుకంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ విమర్శల గురించి, పుష్ప ఐటమ్‌ సాంగ్‌ గురించి స్పందించింది సామ్‌.

'వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికే నాకు పుష్పలో స్పెషల్‌ సాంగ్‌ చేయమని ఆఫర్‌ వచ్చింది. నేను ఏ తప్పూ చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? అనుకున్నాను. వెంటనే ఆ ఆఫర్‌కు ఓకే చెప్పాను. కానీ ఎప్పుడైతే అఫీషియల్‌గా నేను ఆ పాట చేస్తున్నానని ప్రకటించారో అప్పుడు మొదలైంది అసలు తలనొప్పి. విడిపోయిన వెంటనే నువ్వు ఐటం సాంగ్స్‌ చేయడం ఏం బాగోదు. ఇంట్లో కూర్చుంటే చాలులే.. అంటూ కుటుంబసభ్యులు, తెలిసినవాళ్లు సలహాలు ఇచ్చారు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే ఫ్రెండ్స్‌ కూడా ఆ పాట చేయొద్దనే చెప్పారు. ​కానీ నాకు వాళ్ల మాట వినాలనిపించలేదు.

ఎందుకంటే వైవాహిక బంధంలో నేను నూటికి నూరుపాళ్లు నిజాయితీగా ఉన్నాను. కానీ అది వర్కవుట్‌ కాలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసినట్లు ఎందుకు ఇంట్లోనే దాక్కోవాలి? చేయని తప్పుకు నన్ను నేను హింసించుకుని ఎందుకు బాధ అనుభవించాలి? ఇప్పటికే ఎన్నో కష్టాలు అనుభవించాను. నటిగా ప్రతివిషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలని, మరింత అందంగా కనిపించాలని కష్టపడుతూనే ఉన్నాను. మయోసైటిస్‌, మెడికేషన్‌ కారణంగా నాపై నాకే కంట్రోల్‌ లేకుండా పోయింది. ఇప్పుడు నేను కళ్లద్దాలు పెట్టుకుంది కూడా ఏదో స్టైల్‌ కోసం కాదు, వెలుతురిని నా కళ్లు తట్టుకోలేవు. ఇలాంటి ఇబ్బంది ఏ నటికీ రాకూడదు' అని చెప్పుకొచ్చింది సమంత.

మరిన్ని వార్తలు