Samantha: సమంత దెబ్బకు బాలీవుడ్ హీరోయిన్స్ వెనకడుగు

25 Sep, 2022 08:47 IST|Sakshi

సమంత క్రేజ్‌ మామూలుగా లేదుగా. చదువుకునే రోజుల్లో పాకెట్‌మనీ కోసం పలు కార్యక్రమాల్లో రిసెప్షనిస్టుగా పని చేసిన సమంత ఆ తరువాత సినిమాలో హీరోయిన్‌గా విశేష గుర్తింపు పొందింది. ఉన్న తాండి వరువాయా చిత్ర తెలుగు రీమేక్‌ ఏ మాయ చేశావేతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ చిత్ర విజయంతో కెరీర్‌ పరంగా ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

తెలుగు స్టార్‌ హీరోలతో జతకట్టే అవకాశాలు వరుసగా తలుపు తట్టడంతో సమంత క్రేజీ హీరోయిన్‌ అయిపోయింది. అలాగే నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడి అక్కినేని కుటుంబ సభ్యురాలు కావడంతో ఆమె ఇమేజ్‌ ఆకాశాన్నంటింది. విడాకుల తర్వాత కూడా ఆమె క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. పైగా మరింత పెరిగిందనే చెప్పాలి. ఇందుకు కారణం ఆమె బోల్డ్‌నెస్‌ నటన కావచ్చు. తీసుకునే నిర్ణయాలు కావచ్చు. శుభ డీలక్స్‌ వంటి తమిళ చిత్రం, ఫ్యామిలీమెన్‌ –2 వంటి హిందీ వెబ్‌సిరీస్‌లో సమంత పాత్ర చర్చనీయాంశంగా అయినా ఆమెకు అదికూడా ప్లస్సే అయ్యింది.

ఇక తాజాగా పాన్‌ ఇండియా స్థాయిలో నంబర్‌–1 నటిగా సమంతా చోటు దక్కించుకున్నట్లు తాజా సర్వేలో తేలింది. సామాజిక మాధ్యమాల్లో చేపట్టిన ఓ సర్వే ప్రకారం 10 మంది నటీమణులు జాతీయస్థాయిలో రాణిస్తుండగా.. వారిలో సమంత అగ్రస్థానంలో కైవసం చేసుకుంది. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా అలియాభట్, నయనతార, కాజల్‌ అగర్వాల్, దీపికా పదుకొనే, రష్మిక మందన్న, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, పూజా హెగ్డే, అనుష్క నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో సమంత అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

కాగా సమంత ప్రస్తుతం తెలుగులో 3 చిత్రాలలో నటిస్తోంది. అందులో శాకుంతలం, యశోద చిత్రాలు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు కాగా ఖుషి చిత్రంలో విజయ్‌ దేవరకొండతో జత కడుతోంది. కాగా చారిత్రక కథాంశంతో కూడిన శాకుంతలం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్‌ 4న పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు