Samantha: ఈ విషయం అమ్మ చెప్పింది.. సమంత ఆసక్తికర పోస్టు వైరల్‌

24 Oct, 2021 19:09 IST|Sakshi

Samantha: టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ సమంత విడాకుల బాధలో నుంచి బయటపడేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్‌ శిల్పారెడ్డితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. అయితే విడాకులు తీసుకోవడానికి ముందు నుంచీ సమంత 'మై మమ్మా సెడ్‌(మా అమ్మ చెప్పింది)' అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొన్ని పోస్టులు చేయగా అవి సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. చాలా రోజుల తర్వాత సామ్‌.. మరోసారి 'మై మమ్మా సెడ్‌ అంటూ మరో ఆసక్తికర పోస్ట్‌ చేసింది.

'ఇప్పుడు మీరిలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి, అలాగే రేపు ఏం కావాలని కోరుకుంటున్నారో అందుకోసం నిరంతరం పోరాడుతూ ఉండండి' అని చెప్పుకొచ్చింది. కాగా అక్టోబర్‌ 2న తన భర్త, టాలీవుడ్‌ హీరో నాగ చైతన్యతో విడిపోతున్నట్లు సమంత ఇన్‌స్టాలో అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చై-సామ్‌ విడాకులు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. చైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన తర్వాత సామ్‌ నైరాశ్యంలో కూరుకుపోయారని వార్తలు వెలువడ్డాయి. ఆ బాధలో నుంచి బయటపడేందుకే ఆమె తీర్థయాత్రలు చేస్తున్నట్లు సమాచారం. ఇక విడాకుల తర్వాత సామ్‌ రెండు కొత్త చిత్రాలకు ఓకే చెప్పింది. త్వరలోనే వీటికి సంబంధించిన షూటింగ్స్‌లోనూ పాల్గొననుంది.

మరిన్ని వార్తలు