గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత పాన్‌ ఇండియా చిత్రం

15 Mar, 2021 20:06 IST|Sakshi

అక్కినేని కోడలు, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ పూజ కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా చిత్ర యూనిట్‌ సోమవారం షేర్‌ చేసింది. ఈ సందర్భంగా వచ్చే వారం నుంచి ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ జరగనున్నట్లు వెల్లడించింది.

ఇందులో టైటిల్‌ రోల్‌ సమంత పోషిస్తుండగా దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ కనిపించనున్నట్లు మూవీ యూనిట్‌ స్పష్టం చేసింది. అనుష్కతో ‘రుద్రమదేవి’ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్‌ సమంతతో ‘శాకుంతలం’ మూవీ పాన్‌ ఇండియాగా తెరకెక్కిస్తుండంతో దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఎపిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కనున్న ఈ మూవీకి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘శాకుంతలం’ను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. 

మరిన్ని వార్తలు