Samantha : అవి నా జీవితాన్ని నాశనం చేయకూడదు అనుకున్నా.. అందుకే స్ట్రాంగ్‌ అయ్యా

11 Apr, 2023 07:43 IST|Sakshi

‘‘ఒకప్పుడు నా లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్స్‌ లేవు. సో.. నేను చాలా సింపుల్‌గా, హ్యాపీగా ఉన్నాను. కానీ నా జీవితంలో నేను కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరైనా తమ జీవితాల్లో స్ట్రగుల్స్‌ను ఫేస్‌ చేసినప్పుడు వారు స్ట్రాంగ్‌గా మారిపోతుంటారు. నేనూ అంతే. నన్ను నేను ప్రత్యేకం అనుకోవడం లేదు. అయితే నా జీవితంలో నాకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇవి నా జీవితాన్ని నాశనం చేయకూడదని అనుకుని, ఇందుకు తగ్గట్లుగా జీవితంలో ముందుకెళుతున్నాను’’ అని సమంత అన్నారు.

కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘శాకుంతలం’. ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత్‌ మహారాజుగా దేవ్‌మోహన్‌ నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సమంత మాట్లాడుతూ–‘‘శాకుంతలం’ పూర్తి కథ విన్నప్పుడు నేను సర్‌ప్రైజ్‌ అయ్యాను. భారతీయ సాహిత్యంలో ఎంతోమంది ప్రేమించే శకుంతల పాత్రను పోషించడం నాకు పెద్ద బాధ్యతగా అనిపించింది.

‘ది ఫ్యామిలీ మేన్‌ 2’ వెబ్‌సిరీస్‌లో రాజీవంటి క్యారెక్టర్‌ చేసిన నేను వెంటనే శకుంతల  పాత్ర చేయడానికి తొలుత భయపడి నో చెప్పాను. కానీ శకుంతల అంటే కేవలం అందమైన అమ్మాయి మాత్రమే కాదు.. హుందాతనం, ఆత్మగౌరవం కలిగిన యువతి కూడా. ఏ తరం అమ్మాయిలకైనా శకుంతల పాత్ర కనెక్ట్‌ అవుతుందని మళ్లీ ఆలోచించి ఒప్పుకున్నాను. తొలి సారిగా 3డీలో ‘శాకుంతలం’ ట్రైలర్‌ చూసి షాక్‌ అయ్యాను.

ఈ సినిమా కోసం గుణశేఖర్‌గారు మ్యాజికల్‌ వరల్డ్‌ను క్రియేట్‌ చేశారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షూటింగ్స్‌కి రమ్మని ఎవరూ నాకు ఫోన్‌ చేయలేదు. ఈ విధంగా నాకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్‌ లభించింది’’ అన్నారు. ‘‘కథను నమ్మి ‘శాకుంతలం’ సినిమా తీశాం’’ అన్నారు గుణశేఖర్‌. ‘‘ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే గుణశేఖర్‌గారి ప్రయత్నంలో నేనూ భాగమవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ‘దిల్‌’ రాజు.

మరిన్ని వార్తలు