డ్రగ్‌ కేసులో నటి సంజనాకు ఊరట..

12 Dec, 2020 12:39 IST|Sakshi

సంజనకు బెయిల్‌

సాక్షి బెంగళూరు : శాండల్‌వుడ్‌ నటి సంజనా గల్రానీకి ఊరట లభించింది. ఆమెకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. శాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంలో సంజనాను సీసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గత రెండు నెలల నుంచి ఆమె పరప్పన అగ్రహార జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆమె హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం న్యాయమూర్తి శ్రీనివాస్‌ హరీశ్‌ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. రూ .3,00,000 విలువైన బాండ్‌తోపాటు అంతే మొత్తం విలువైన రెండు పూచీకత్తు పత్రాలను సమర్పించాలనే షరతు విధించారు. అలాగే నెలకు ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని, దర్యాప్తునకు సహకరించాలని  ఆదేశించారు. (చదవండి: డ్రగ్స్‌ కేసు.. హీరోయిన్‌లకు షాక్‌)

ఇంతకు మందు సంజనా పలుమార్లు బెయిల్ దరఖాస్తు చేసుకోగా వాటన్నింటిని హైకోర్టు తిరస్కరించింది. కాగా ఇటీవల శాండిల్‌వుడ్‌ని డ్రగ్స్ కేసు కుదిపేసిన విషయం తెలిసిందే. సీసీబీ అధికారుల విచారణలో పలువురు కన్నడ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో పలువురిని సీసీబీ  పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన రెండో నటి సంజనా. ఆమె కంటే ముందు  రాగిణి ద్వివేదిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: వారికి అండర్‌వరల్డ్‌ డాన్‌లతో సంబంధాలు..!)

మరిన్ని వార్తలు